ఉదయ్, భాస్కర్ రెడ్డి అరెస్ట్‌… తర్వాత ఎవరు?

Uday Reddy YS Bhaskar Reddy వైఎస్ వివేకా హత్య కేసు విచారణ పూర్తి చేయడానికి సుప్రీంకోర్టు ఏప్రిల్ 30 గడువు విధించడంతో సీబీఐలో చురుకు పుట్టింది. శనివారం వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడి ఉదయ్ కుమార్‌ రెడ్డిని అరెస్ట్‌ చేసిన సీబీఐ బృందం, ఆదివారం ఉదయం కడప చేరుకొని అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌ తరలిస్తున్నారు. వివేకా హత్యకు కుట్ర చేయడం, హత్య తర్వాత సాక్ష్యాధారాలు మాయం చేసినందుకు ఆయనను అరెస్ట్‌ చేస్తున్నట్లు సీబీఐ పేర్కొంది.

అవినాష్ రెడ్డి అనుచరులు, వైసీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో అక్కడకు చేరుకొని వారిని అడ్డుకొనే ప్రయత్నం చేశారు కానీ ముందుగానే పోలీసులను మోహరించి అర కిలోమీటరు దూరంలో వారందరినీ నిలిపివేశారు. మరి కొద్దిసేపటిలో ఆయనను హైదరాబాద్‌లో మేజిస్ట్రేట్ ఎదుట హాజరు పరిచిన తర్వాత రిమాండ్‌పై చంచల్‌గూడ జైలుకి తరలించనున్నారు.

ADVERTISEMENT

సిఎం జగన్మోహన్ రెడ్డి అనంతపురం జిల్లా నార్పాలలో సోమవారం పర్యటించి జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొనవలసి ఉంది. కానీ చివరి నిమిషంలో రద్దు చేసుకొన్నారు. ఈ నెల 26వ తేదీన ఈ కార్యక్రమంలో పాల్గొంటారని సిఎంవో ప్రకటించింది. సీబీఐ అధికారులు భాస్కర్ రెడ్డిని అరెస్ట్‌ చేసి హైదరాబాద్‌కు తరలిస్తున్నందునే సిఎం జగన్‌ ఈరోజు కార్యక్రమం రద్దు చేసుకొన్నారా లేక వేరేమైనా కారణం ఉందా? అనేది తెలియవలసి ఉంది.

వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి అనుచరుడు ఉదయ్ కుమార్‌ రెడ్డిని, ఇప్పుడు అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్‌ చేసినందున రేపో ఎల్లుండో ఎంపీ అవినాష్ రెడ్డిని అరెస్ట్‌ చేయడం ఖాయంగానే కనిపిస్తోంది. ఈ కేసును ఆయన ఏవిదంగా ఎదుర్కొంటారనేది తేలికగానే ఊహించవచ్చు. కానీ అవినాష్ రెడ్డి అరెస్ట్‌ అయితే ఇంతకాలం ఆయనను గట్టిగా వెనకేసుకువస్తున్న జగన్ ప్రభుత్వానికి పెద్ద ఇబ్బంది కలుగుతుంది. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబుని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన్నట్లు అవినాష్ రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదు. అలాగని ఆయనపై ఎటువంటి చర్య తీసుకోకపోతే హత్య కేసులో అరెస్ట్‌ అయినవారిని జగన్ ప్రభుత్వం వెనకేసుకువచ్చి కాపాడుతోందంటూ ప్రతిపక్షాలు విమర్శలను భరించడం కష్టమే. వాటి వలన వైసీపీకి అప్రదిష్ట కలగడమే కాకుండా రాజకీయంగా తీవ్ర నష్టం జరుగుతుంది. కనుక అవినాష్ రెడ్డి అరెస్ట్‌ కాగానే ఆయన చేత పదవికి రాజీనామా చేయిస్తుందేమో? ఒకవేళ అవినాష్ రెడ్డి అరెస్ట్‌ కాకుండా అడ్డుకోలేకపోతే అది పార్టీలో మిగిలినవారిపై తప్పక ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి పరిస్థితి ఏమిటనే సందేహం కలుగకమానదు. కనుక అవినాష్ రెడ్డిని కాపాడుకోవడానికి సిఎం జగన్మోహన్ రెడ్డి మరోసారి ఢిల్లీ బయలుదేరక తప్పదేమో?

ADVERTISEMENT
Latest Stories