మంగళగిరి వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణ రెడ్డి 2024 ఎన్నికల ముందు నుంచి వైసీపీ కి కొంచెం కొంచెంగా దూరమవుతూ వచ్చారు. అయితే ఆ దూరానికి కారణం కూడా సాయి రెడ్డి చెపుతున్నట్టుగా జగన్ కోటరినే కావచ్చు లేదా ఆర్కే ముందు చూపు అనుకోవచ్చు.
2024 ఎన్నికల ముందు వై నాట్ 175 నినాదంలో భాగంగా వైస్ జగన్ చేపట్టిన ఎమ్మెల్యే ల నియోజకవర్గ మార్పులు చేర్పులతో ఆర్కే కి మంగళగిరి స్థానం దూరమయ్యింది. దీనితో ఆర్కే జగన్ ని కాదని వైసీపీ కి రాజీనామా చేసి చెల్లి షర్మిలతో కలిసి కాంగ్రెస్ తో నడవాలని భావించారు.
మరి తెరవెనుక జగన్ ఎటువంటి రాజకీయ వ్యూహాలు వేసారో, ఆర్కేను ఎలా వైసీపీ దారిలోకి తెచ్చారో తెలియదు కానీ ఆళ్ళ తిరిగి షర్మిలకు సారీ చెప్పి వైసీపీ జెండా పట్టుకున్నారు. అయితే లోకేష్ దాటికి మంగళగిరిలో వైసీపీ ఆనవాళ్లు పూర్తిగా చెల్లాచెదరవడంతో ఇక ఆర్కే వైసీపీ తో పాటుగా రాజకీయాలకు కూడా దూరం జరిగారు.
ఈ నేపథ్యంలో మంగళగిరి వైసీపీ ఇంఛార్జ్ గా దొంతిరెడ్డి వేమారెడ్డి పార్టీ బాధ్యతలు భుజాన వేసుకున్నారు. ఇటువంటి సందర్భంలో తాజాగా ఆళ్ళ రామకృష్ణ రెడ్డికి ఏసీబీ నోటీసులు జారీ చేసింది. విజయవాడ ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఫిబ్రవరి 27 న విజయవాడ కోర్టులో ఆళ్ళ హాజరుకావాలంటూ ఏసీబీ ఈ నెల 21 న హైద్రాబాద్ లో ఆర్కేకు నోటీసులు ఇష్యూ చేసింది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో మంగళగిరి ఎమ్మెల్యే గా ఉన్న ఆర్కే ఇన్నర్ రింగ్ రోడ్ లో అక్రమాలు జరిగాయంటూ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారాయణ మీద కోర్ట్ కెళ్లారు. అయితే తాజాగా ఈ కేసుని సీఐడీ క్లోజ్ చెయ్యాలని కోర్ట్ లో పిటిషన్ వేయగా అందుకు ఫిర్యాదుదారుగా ఉన్న ఆర్కే కు సీబీఐ నోటీసులిచ్చింది.
కేసు క్లోజ్ చేయనున్న నేపథ్యంలో ఫిర్యాదుదారుని గా ఆర్కేకు ఎటువంటి అభ్యంతరాలైన ఉంటే న్యాయస్థానానికి వచ్చి తన వాదన వినిపించాలంటూ అధికారులు నోటీసిలివ్వడంతో ఇప్పుడు ఈ కేసు ఎటువైపు మలుపు తిరుగుతుందనే ఆసక్తి సర్వత్రా కనిపిస్తుంది.
ఆర్కే వైసీపీ కి దూరంగా జరగడంతో ఈ కేసు విషయంలో ఆర్కే స్వరంలో ఏమైనా మార్పులు రానున్నాయా.? లేదా ఆర్కేకు తిరిగి వైసీపీ మద్దతు లభించి జగన్ ఆదేశాల మేరకు ఆర్కే తన మునుపటి వాదనకే కట్టుబడి ఉంటారా అనేది ఆసక్తిగా మారింది.






