విశాఖ మెట్రోకి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సిఎం చంద్రబాబు నాయుడు నేడు ఢిల్లీలో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్తో సమావేశమైనప్పుడు ఆయనే స్వయంగా ఈ శుభవార్త తెలిపారు. సిఎం చంద్రబాబు నాయుడు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. విశాఖతో పాటు విజయవాడ మెట్రోకి కూడా రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర నివేదిక పంపింది. కనుక త్వరలోనే దానికీ అనుమతి లభించడం ఖాయమే.
విశాఖ మెట్రో ప్రతిపాదన కారణంగా నగరంలో కొత్తగా ఫ్లై ఓవర్ల నిర్మాణ పనులు ప్రారంభించలేని విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ఫ్లై ఓవర్లు ఒకసారి, తర్వాత మెట్రో కారిడార్ ఒకసారి నిర్మించడానికి చాలా భారీగా ఖర్చు అవుతుంది. కనుక డబుల్ డెక్కర్ పద్దతిలో కిందన వాహనాల కోసం ఫ్లై ఓవర్, దానిపై మెట్రో కారిడార్ కలిపి ఒకేసారి నిర్మిస్తే ఖర్చు తగ్గుతుంది.
ముఖ్యంగా రెండూ వేర్వేరుగా నిర్మించాలంటే భూసేకరణ ఖర్చు పెరుగుతుంది. కనుక ఫ్లై ఓవర్, మెట్రో ఒకే వరుసలో నిర్మిస్తే ఆ మేరకు ఖర్చు తగ్గుతుంది. నిర్మాణ పనులు సమాంతరంగా సాగుతాయి. కనుక సమయం కూడా బాగా కలిసి వస్తుందని నిపుణులు సూచించారు.
వారి సూచనల మేరకు డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్ కమ్ మెట్రో కారిడార్ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు, నివేదిక పంపింది. దానికే కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ఆమోదం తెలిపింది.
కూటమి ప్రభుత్వానికి ఇప్పటికే దాదాపు రెండేళ్ళు పూర్తికావస్తోంది. ఇక మిగిలిన మూడేళ్ళలో చివరి సంవత్సరంలో చివరి ఆరేడు నెలలు ఎన్నికల హడావుడితోనే సరిపోతుంది. కనుక వీలైనంత త్వరగా నిర్మాణ పనులు మొదలు పెట్టి ఎన్నికలలోగా పూర్తి చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు అనుకోవడం సహజమే.
ఈ ఏడాది జూన్ నెలాఖరులోగా భోగాపురం వద్ద అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కాబోతోంది. కనుక ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగిపోతుంది. కనుక రాబోయే మూడేళ్ళలో ఇది పూర్తయితే విశాఖ వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరిపోతాయి.
విశాఖకు అంతర్జాతీయ విమానాశ్రయం, మెట్రో, గూగుల్ వగైరా ఐటి కంపెనీలు వచ్చేస్తే మెట్రో నగరాలకు ఉండాల్సిన హంగులన్నీ ఏర్పాటు అయినట్లే!






