నేడు శాసనసభలో సిఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, “టీనేజ్ పిల్లలు సోషల్ మీడియా వలన జీవితాలు పాడు చేసుకుంటున్నారు. వారిని దానికి దూరంగా ఉంచకపోతే అనేక అనర్ధాలు జరుగుతున్నాయి. కనుక 13 సం.లు ఆలోపు వయసున్న పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలని సూచనలు వచ్చాయి. ఇది మంచి సూచనే కనుక 90 రోజులలోగా దీనిని ఆచరణలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తాము.
అయితే 13 సం.లకే పరిమితం చేయాలా లేక 16 సం.ల వరకు ఈ నిషేధం వర్తింపజేయాలా? అని చర్చించుకుంటున్నాము. మేధావులు, నిపుణుల అభిప్రాయలు తీసుకొని తగిన నిర్ణయం తీసుకుంటాము,” అని అన్నారు.
మద్యం షాపుల్లో “18 ఏళ్ళ లోపువారికి మద్యం విక్రయించబడదు,” అని బోర్డులు కనిపిస్తుంటాయి. సిగరెట్లు, తంబాకు తింటే క్యాన్సర్ వస్తుందనే హెచ్చరికలు ప్రతీ ప్యాకెట్ మీద ముద్రించి ఉంటాయి. సినిమాలు, ఓటీటీలలో కూడా ‘పొగత్రాగుట, మద్యం సేవించుట హానికరం’ అనే చిన్న ప్రకటనలు కనిపిస్తుంటాయి.
కానీ 18 ఏళ్ళ లోపువారు కూడా వీటిన్నిటినీ వాడుతున్నారు. చూస్తున్నారు. వాటినే ఆపలేకపోతున్నప్పుడు ఇంట్లో లేదా జేబులో ఉండే సెల్ ఫోన్లో వాడుకోగలిగే సోషల్ మీడియాని వాడకుండా ఆపడం సాధ్యమేనా?
ఒకవేళ దీని కోసం ఏఐ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించినా టీనేజ్ పిల్లల చేతిలో సెల్ ఫోన్ ఉన్నంత కాలం సోషల్ మీడియా వాడకుండా నిషేధించడం సాధ్యమేనా? అంటే కాదనే అనిపిస్తుంది.
కనుక పిల్లలు సోషల్ మీడియా వాడకుండా చేయాలంటే కనీసం వారి చేతికి సెల్ ఫోన్ ఇవ్వకుండా అడ్డుకోవాల్సి ఉంటుంది. మన కుటుంబ వ్యవస్థ, సమాజంలో ఇది సాధ్యమేనా? అని అనుమానం కలుగుతుంది.
కానీ ఇప్పుడే అనుమానించడం తొందరపాటే అవుతుంది. కనుక పిల్లలు సోషల్ మీడియా వాడకుండా నిషేధం ఏవిధంగా అమలుచేస్తారో… దాని విధివిధానాలు ఏమిటో తెలిసేవరకు వేచి చూడాల్సిందే!




