గన్నవరం వైసీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరులు సోమవారం కర్రలు పట్టుకొని రోడ్లమీదకి వచ్చి జై వంశీ… అంటూ నినాదాలు చేస్తూ టిడిపి కార్యాలయంవైపు సాగుతుంటే ప్రజలు తీవ్ర భయాందోళనలకి గురయ్యారు. పోలీస్ అధికారులు వారిని “అన్నా వద్దనా… వెళ్లొదన్నా… ఆగండన్నా…” అంటూ మీడియా ప్రతినిధుల ఎదుటే బ్రతిమాలుకోవడం చూస్తే వంశీ అనుచరుల ప్రతాపం అర్దం అవుతుంది. తమని బ్రతిమాలుకొంటున్న పోలీసులని పక్కకి నెట్టి వారందరూ నేరుగా టిడిపి కార్యాలయం వద్దకి వెళ్ళారు. ఎస్సై ఎదుటే అక్కడే ఉన్న కారుపై కర్రలతో, రాళ్ళతో దాడిచేశారు. తర్వాత వాటికి నిప్పు పెట్టారు. ఆ తర్వాత వారు టిడిపి కార్యాలయంలోకి ప్రవేశిస్తుంటే పోలీసులు వారిని బ్రతిమాలుకొంటూ అడ్డుకొనేందుకు ప్రయత్నించారు కానీ వారు లోపలకి చొచ్చుకుపోయి విధ్వంసం సృష్టించారు. వైసీపీ ప్రభుత్వం, పోలీసుల తీరుని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా తప్పు పడుతూ వరుసగా ట్వీట్స్ చేశారు.
“గన్నవరం టీడీపీ కార్యాలయం పై వైసీపీ గూండాల దాడిని, వాహనాలను తగలబెట్టిన ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. రాష్ట్రాన్ని రావణకాష్ఠంలా మారుస్తున్న జగన్ ఆ మంటల్లో కాలిపోవడం ఖాయం. వైసీపీ ఉన్మాదులు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏ గాడిదలు కాస్తున్నారు? రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవే లేకుండా చేశారు. పోలీసు శాఖను మూసేశారా? లేక వైసీపీలో విలీనం చేశారా? సీఎం ఫ్యాక్షనిస్ట్ మనస్తత్వానికి ఈ ఘటనలే ఉదాహరణ. రాష్ట్ర గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలి. కారకుల పై తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలి,” అని కోరారు.
నారా లోకేష్ స్పందిస్తూ, “గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై వైసీపీ సైకోల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. టిడిపిపై జగన్ రెడ్డి చేయిస్తున్న ఒక్కో దాడి వైసీపీకి సమాధి కట్టే ఒక్కో ఇటుక లెక్క. గన్నవరంలో టిడిపి ఆఫీసుపై వైసీపీ గూండాలు దాడి చేసి, నేతలని కొట్టి, వాహనాలను తగలబెడుతుంటే..పోలీసులు ప్రేక్షకుల్లా చూడటం ప్రజాస్వామ్యానికే మాయని మచ్చ. పాపాలు చేయడంలో శిశుపాలుడిని మించిపోయిన గన్నవరం నొటోరియస్ క్రిమినల్ కి పోగాలం దాపురించింది. ఆడిన ప్రతీ తప్పుడు మాటకి, చేసిన ప్రతీ దుర్మార్గపనికి పశ్చాత్తాపపడే రోజు దగ్గర పడింది. టిడిపి నేతలు, కార్యకర్తలు ఎవరూ అధైర్యపడొద్దు. పార్టీ అండగా ఉంటుంది. అరాచకుడి దురాగతాలకు బుద్ధి చెబుదాం,” అంటూ ట్వీట్పై చేశారు.



