టిడిపి సూచన మేరకు యువనేత నారా లోకేష్ తన యువగళం పాదయాత్రలో నేటి నుంచి స్వల్ప మార్పులు చేసుకొన్నారు. రాష్ట్రంలో ఎండలు, ఉష్ణోగ్రతలు వడగాడ్పులు, విపరీతంగా పెరిగిపోయినందున నేటి నుంచి ఉదయం 7 గంటలకే పాదయాత్ర ప్రారంభించి ఉదయం 11 గంటల వరకు చేస్తారు. కనుక ప్రతీరోజు పాదయాత్రకు ముందు క్యాంప్ సైట్ వద్ద అభిమానులు, పార్టీ కార్యకర్తలతో సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమాన్ని ఇక నుంచి మధ్యాహ్నం 3 గంటలకు మార్చారు. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి పాదయాత్ర ప్రారంభించి రాత్రి 7-8 గంటల వరకు కొనసాగిస్తారు.
ఉదయం 11 గంటలకే పాదయాత్రలో బ్రేక్ తీసుకొన్నప్పటికీ క్యాంప్ సైటులో స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తలతో నారా లోకేష్ సమావేశమయ్యి పార్టీ వ్యవహారాలు, పాదయాత్రలో ప్రస్తావించాల్సిన అంశాల గురించి చర్చిస్తారు. పాదయాత్రలో తన దృష్టికి వచ్చిన ప్రజాసమస్యలను, వాటి పరిష్కారం కోసం తాను ప్రజలకు ఇచ్చిన హామీలను ఎప్పటికప్పుడు కంప్యూటర్లో అప్లోడ్ చేయిస్తున్నారు. తద్వారా రేపు టిడిపి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్కటీ మరిచిపోకుండా, ప్రతీ సమస్యను, హామీని పరిష్కరించేందుకు ఉపయోగపడతాయి.
నారా లోకేష్ సోమవారం శింగనమల నియోజకవర్గంలో 65వ రోజు యువగళం పాదయాత్రలో సలకం చెరువు గ్రామంలో శిధిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాల కనపడగా లోనికి వెళ్ళి చూశారు. దానిలో 40 మంది పిల్లలు చదువుకొంటున్నారని తెలుసుకొని షాక్ అయ్యారు. ఆ ఫోటోలను ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ, “జగన్ ప్రభుత్వం నాడు-నేడు కార్యక్రమం గురించి ప్రచారం చేసుకోవడమే తప్ప చేసిందేమీ లేదని అర్దం అవుతోంది. వాస్తవ పరిస్థితులు ఈవిదంగా ఉంటే వైసీపీ మీడియా ప్రజలకు చూపిస్తున్నది వేరేలా ఉంటోంది,” అని ట్వీట్ చేశారు.



