ఆదివారం విశాఖపట్నంలో జరిగిన వాల్తేర్ వీరయ్య ప్రీ-రిలీజ్ ఈవెంట్లో మెగాస్టార్ చిరంజీవి ఓ అనూహ్య ప్రకటన చేశారు. విశాఖ నగరం ఎంతో అందంగా, ప్రశాంతంగా ఉంటుందని కనుక ఇక్కడ ఇల్లు కట్టుకోబోతున్నానని చెప్పారు. ఇప్పటికే ఓ స్థలం కూడా కొనుగోలు చేశానని చిరంజీవి చెప్పారు.
అయితే ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న అరాచక పరిస్థితులను చూస్తున్న వారెవరూ ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టేందుకు, స్థిరాస్తులు కొనుగోలు చేసేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదనేది బహిరంగ రహస్యం. అందుకే సిఎం జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఆహ్వానించినా తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్కి వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు.
అదీగాక వైసీపీ ప్రభుత్వం సినీ పరిశ్రమని రాజకీయాలతో ముడిపెట్టి వేధిస్తుండటంతో సినిమాల ప్రీ-రిలీజ్ ఈవెంట్లు నిర్వహించుకోవడం కూడా చాలా కష్టంగా మారింది. వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్య సినిమాల ప్రీ-రిలీజ్ ఈవెంట్ల నిర్వహణకు ఎదురైన ఇబ్బందులే ఇందుకు తాజా నిదర్శనాలు.
ఈ పరిస్థితులలో చిరంజీవి విశాఖపట్నంలో ఇల్లు కట్టుకొంటానని చెప్పడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఒకవేళ ఆయన విశాఖలో ఇల్లు కట్టుకొన్నా సినీ పరిశ్రమ అంతా హైదరాబాద్లోనే ఉంది కనుక నిత్యం సినిమా షూటింగులకి హాజరుకావలసిన చిరంజీవి విశాఖకి వచ్చి ఉండలేరు. మరి ఇల్లు ఎందుకు కట్టుకోవాలనుకొంటున్నారు?అంటే బహుశః వచ్చే ఎన్నికలలో తమ్ముడికి ప్రజల మద్దతు సంపాదించిపెట్టేందుకు కావచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.
తాను రాజకీయాలలో రాణించలేకపోయినా తమ్ముడు పవన్ కళ్యాణ్ రాణిస్తున్నాడని, ఏదో ఓ రోజు అత్యున్నతమైన పదవిలో చూస్తామని, తన తమ్ముడి ఎదుగుదలకి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని కొన్ని రోజుల క్రితం చిరంజీవి చెప్పారు. కనుక విశాఖలో ఇల్లు కట్టుకొని తరచూ రాకపోకలు సాగిస్తుండటం ద్వారా ఉత్తరాంద్ర ప్రజలతో మరింత బలమైన అనుబందం ఏర్పరచుకోవాలని చిరంజీవి భావిస్తున్నట్లున్నారు.
వచ్చే ఎన్నికలు తమ్ముడు పవన్ కళ్యాణ్కి చాలా కీలకమైనవి కనుక ఎన్నికల గంట మోగిన తర్వాత చిరంజీవితో సహా మెగా హీరోలందరూ ప్రత్యక్షంగా జనసేన ఎన్నికల ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉంది. బహుశః అందుకే చిరంజీవి విశాఖలో ఇల్లు కట్టుకొంటున్నారని భావించవచ్చు.
వైసీపీ ప్రభుత్వం చేతిలో చిక్కుకొని విలవిలలాడుతున్న తెలుగు సినీ పరిశ్రమకి కూడా వచ్చే ఎన్నికలు కీలకమైనవే. కనుక నందమూరి హీరోలు, మహేష్ బాబు వంటి నటులు, పలువురు సినీ ప్రముఖులు కూడా వచ్చే ఎన్నికలలో టిడిపి, జనసేనల తరపున ఎన్నికల ప్రచారంలో తప్పక పాల్గొనే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు.



