టిడిపి యువనేత నారా లోకేష్ నేడు పీలేరు నియోజకవర్గంలో యువగళం పాదయాత్ర చేస్తున్నారు. పీలేరులో ప్రెస్మీట్ నిర్వహించి విశాఖ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రాష్ట్ర ప్రజలని మభ్యపెట్టేందుకు జగన్ ప్రభుత్వం వందల కోట్లు ఖర్చు పెట్టి ఆడిన అతిపెద్ద డ్రామా అని తేల్చిపడేశారు. ఈ సందర్భంగా తమ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పరిశ్రమల జాబితాలను చార్టుని మీడియాకి విడుదల చేశారు.
టిడిపి హయాంలో ప్రైవేట్ రంగంలో రాయలసీమ ప్రాంతంలో 31% ఉద్యోగాలు, ఉత్తరాంద్రకి 33% ఉద్యోగాలు కల్పించాము. అంటూ నారా లోకేష్ ఏపీ మ్యాప్ ఉన్న ఓ చార్టుని చూపిస్తూ ఏఏ జిల్లాలలో ఏఏ పరిశ్రమలు ఏర్పాటయ్యాయో చూపించారు. ఆ చార్టులో అన్నిటినీ పేర్కొనడం సాధ్యం కాదు కనుక కేవలం దానిలో కేవలం 40 అతిపెద్ద పరిశ్రమలను మాత్రమే చూపిస్తున్నామని వాటి ద్వారానే రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.
అనంతపురానికి కియా, బర్జర్ పెయింట్స్, జాకీ కంపెనీలు, కడపకి వెల్ స్పన్, చిత్తూరుకి ఎలక్ట్రానిక్ ప్యానల్ బోర్డులు తయారుచేసే టిసిఎల్, మొబైల్ ఫోన్స్ తయారుచేసే ఫాక్స్ కాన్, సెల్ కాన్, మైక్రోమ్యాక్స్, డిక్సన్ ఇంకా అనేక ఎలక్ట్రానికి మ్యానుఫాక్చరింగ్ పరిశ్రమలు తీసుకువచ్చాము.
కర్నూలుకి జైన్ ఇరిగేషన్, అనేక సిమెంట్ ఫ్యాక్టరీలు, సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసే కంపెనీలని తీసుకువచ్చాము. నెల్లూరుకి హీరో మోటార్స్, అపోలో టైర్స్, సుజలార్ వంటి వందలాది కంపెనీలను తెచ్చాము. ప్రకాశం జిల్లాకి ఏషియన్ పేపర్ మిల్స్, గుంటూరు, కృష్ణా జిల్లాలకు అశోక్ లైల్యాండ్, కేసీపీ, హెసిఎల్ కంపెనీలను తెచ్చాము.
ఉభయగోదావరి జిల్లాలకు అనేక ఫిషరీస్ కంపెనీలు, రక్షణ రంగానికి చెందిన పరిశ్రమలు, విశాఖజిల్లాకు ఫార్మా, ఐటి కంపెనీలు తెచ్చాము. ఆనాడు మేము ఆదానీ డాటా సెంటర్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకొన్నాము. లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, కంజ్యూవెంట్, మెడ్టెక్ పార్క్ వంటి వాటి ఏర్పాటుకు ఒప్పందాలు చేసుకొన్నాము. అతిపెద్ద పెయింట్స్ తయారీ సంస్థ ఏషియన్ పెయింట్స్ ను కూడా ఉత్తరాంద్ర జిల్లాలకి తీసుకువచ్చాము,” అని చెప్పారు.
నారా లోకేష్ యువగళం పాదయాత్రలో తమ హయాంలో ఏర్పాటుచేసిన కంపెనీలు కనిపించినప్పుడు, వాటిని చూపిస్తూ సెల్ఫీలు తీసుకొని, అక్కడి ఉద్యోగులతో సెల్ఫీలు తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. అంటే ఇటువంటి సదస్సులలో కేవలం ఎంవోయులు చేసుకొని కాగితాలకే తమ ప్రభుత్వం పరిమితం కాలేదని, వాటి స్థాపనకు, వాటితో వేలాదిమందికి ఉద్యోగాలు కూడా కల్పించిందని సెల్ఫీలే సాక్ష్యంగా చూపిస్తున్నారు. కానీ రెండు రోజుల సదస్సులో 378 కంపెనీలుఎంవోయులు చేసుకొంటే వాటితో 78 కంపెనీలు వచ్చినా గొప్ప విషయమే అని నారా లోకేష్ ఎద్దేవా చేశారు. జగన్ ప్రభుత్వానికి దమ్ముంటే ఏపీలో రూ.1.50 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందం చేసుకొన్న రిలయన్స్ ఇండస్ట్రీ ఎంవోయుని బహిర్గతం చేయాలని నారా లోకేష్ సవాలు విసిరారు. మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి ఈ సవాల్ స్వీకరించగలరా?



