శుక్రవారం అర్ధరాత్రి నుంచి గృహ వినియోగ వంట గ్యాస్ సిలిండర్ ధరపై రూ.60లు, వాణిజ్య వినియోగ గ్యాస్ సిలిండర్ ధరపై రూ.115 చొప్పున పెరిగాయి. మామూలుగా అయితే గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు సాధారణ వార్త మాత్రమే.
కానీ ఇదీ ట్రంప్ పుణ్యమే. ఆయనకి ఇరాన్తో యుద్ధం చేయాలనే కోరిక కలగడం వల్లనే దేశ ప్రజలపై ఈ భారం పడింది కదా?
దేశంలో మారుమూల గ్రామాలలో నివసించేవారికి ఆయన ఇరాన్తో యుద్ధం చేస్తున్నారనే విషయం తెలిసి ఉండకపోవచ్చు. దేశంలో చాలా మందికి ఆయనెవరో కూడా తెలీదు. కనీసం అయన ఫొటో కూడా చూసి ఉండరు. కాని వారు కూడా ఆయన కోరికకి తెలియకుండానే మూల్యం చెల్లిస్తున్నారు.
ఒక్క భారత్లో మాత్రమే గ్యాస్ ధరలు పెరిగాయనుకోవడానికి లేదు. ప్రపంచంలో చాలా దేశాల ప్రజలు కూడా ట్రంప్ ముచ్చటకి మూల్యం చెల్లిస్తూనే ఉంటారు.
భారత్లో రెండు రకాల గ్యాస్ సిలిండర్ల ధరలు కలిపి రూ.200 చొప్పున పెరిగాయి. దేశంలో కోట్ల మంది ఈ సిలిండర్లు వాడుతున్నారు. ఈ లెక్కన ఎన్ని వేల కోట్లు అదనపు భారం మోస్తున్నారో లెక్క కట్టడం కష్టం. ఎవరి కోసం ట్రంప్ కోసమేగా?
గ్యాస్ ధరలు పెంచుకోవడానికి ఈ యుద్ధం సాకు సరిపోతుంది. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుకి కూడా దీనిని వాడుకోవాలని చమురు కంపెనీలు అనుకోకుండా ఉంటాయా? వాటి ధరలు పెంచకుండా ఉంటాయా?
రష్యా నుంచి దాదాపు ఏడాదిపాటు చవుకగా భారత్ ముడి చమురు దిగుమతి చేసుకుంది. కానీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించలేదు. ఎందుకని? ఆ చమురంతా ఎవరు త్రాగేశారు?
ట్రంప్కి కూడా చమురు దాహం చాలా ఎక్కువ. అది ఇప్పట్లో తీరేది కాదు. కనుక చమురు దేశాలన్నిటినీ ఒకటొకటిగా పిండేయడం … అందుకోసం అప్పుడప్పుడు ఇలాంటి యుద్ధాలు చేయక మానరు. ట్రంప్ యుద్ధాలు మానకపోతే వంట గ్యాస్ ధరలు మళ్ళీ మళ్ళీ మండుతూనే ఉంటాయి.
నిజానికి ట్రంప్ అధ్యక్షుడుగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తీసుకుంటున్న చిత్రవిచిత్రమైన నిర్ణయాలతో ప్రపంచ దేశాలకు లక్షల కోట్లు నష్టం కలిగింది. ఒక్క భారతీయ షేర్ మార్కెట్లలోనే ఒక్కో రోజు లక్ష కోట్లు సంపద ఆవిరి అయిపోతోంది. ఈ లెక్కన ప్రపంచవ్యాప్తంగా ఎన్ని కోట్ల కోట్లు నష్టం జరిగిందో లెక్క కట్టడం అసాధ్యం.
ఇన్ని కోట్ల కోట్లు నష్టాలని ట్రంప్ ఈ ఒక్క యుద్ధంతో మరిపించగలిగారు! అందరూ యుద్ధం-పర్యవసానాల గురించే ఆలోచించేలా చేశారు కదా! కనుక వంట గ్యాస్ ధరల పెంపు నాట్ జస్ట్ ఆర్డినరీ న్యూస్!




