దేశంలో ఎక్కడో గంజాయి పట్టుబడితే దాని మూలాలు ఏపీలో ఉంటున్నట్లే ఢిల్లీ లిక్కర్ స్కామ్ మూలాలు కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో ఉండటం కాస్త ఆశ్చర్యకరమైన విషయమే. ఈ కేసులో ఇప్పటికే తెలంగాణ సిఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితని ప్రశ్నించిన సీబీఐ ఇవాళ్ళ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని ప్రశ్నిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో సహా పలువురిని సీబీఐ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వారి నుంచి సేకరించిన ఆధారాలతో ఇప్పుడు సీబీఐ అధికారులు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ని ప్రశ్నిస్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటలకు కేజ్రీవాల్ ఢిల్లీలోని సీబీఐ కార్యాలయంలోకి ప్రవేశించారు. అప్పటి నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఇంకా ప్రశ్నిస్తూనే ఉన్నారు.
ఈ లిక్కర్ స్కామ్లో ‘సౌత్ గ్రూప్’లో కీలక వ్యక్తులుగా ఉన్న కల్వకుంట్ల కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తదితరులు కేజ్రీవాల్ ప్రభుత్వంలో కొందరికి రూ.100 కోట్లు లంచం ముట్టజెప్పారని, ఇందుకు ప్రతిగా వారి కంపెనీలకి, మద్యం సిండికేట్లకు ఆర్ధిక లబ్ధి కలిగేవిదంగా ఢిల్లీ ప్రభుత్వ మద్యం విదానం రూపొందించిందని సీబీఐ, ఈడీలు ఆరోపిస్తున్నాయి. అయితే కేజ్రీవాల్, కేసీఆర్లను రాజకీయంగా ఎదుర్కొలేక సీబీఐ, ఈడీలు ఈ కట్టుకధ అల్లాయని కల్వకుంట్ల కవిత ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ కేసులో కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవితని అరెస్ట్ ఖాయమని ఊహాగానాలు వినిపించినప్పటికీ, ఇది తెలంగాణ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తే అక్కడ బిజెపికి ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుంది. కనుకనే ఆమెను అరెస్ట్ చేసేందుకు సీబీఐ వెనకడుగు వేస్తున్నట్లు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. అయితే ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అంతటివాడిని కూడా విడిచిపెట్టడంలేదనే సంకేతాలు సీబీఐ తెలంగాణ ప్రజలకు పంపిన్నట్లు భావించవచ్చు. కనుక కేసీఆర్ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అనివార్యంగానే కనిపిస్తోంది.



