నెల్లూరులో అనిల్ యాదవ్‌కు స్పేస్ పెరిగింది కానీ…

YSRCP_Nellore_Anil_Kumar_Yadavఎమ్మెల్సీ ఎన్నికల పుణ్యమాని నెల్లూరులో ఒకేసారి ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలపై వేటు పడటంతో, ఇంతకాలం వారితో ఘర్షణ పడుతున్న మాజీ మంత్రి, నెల్లూరు అర్బన్ ఎమ్మెల్యే అనిల్ కుమార్‌ యాదవ్ చాలా సంతోషిస్తున్నారు. నెల్లూరు కార్పొరేషన్‌లో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వర్గం బలంగా ఉండేది. ఆనం రామనారాయణ రెడ్డి తప్పనిసరి పరిస్థితులలో వెంకటగిరి నియోజకవర్గానికి వెళ్ళినప్పటికీ ఆయన దృష్టి అంతా ఎప్పుడూ నెల్లూరు పట్టణంపైనే ఉండేది. పట్టణంలో ఆయన ప్రభావం ఎక్కువగానే ఉండేది. సీనియర్ నేత అయిన మేకపాటి చంద్రశేఖర్ రెడ్డికి కూడా నెల్లూరుపై మంచి పట్టుంది. ఇప్పుడు ఈ ముగ్గురూ పార్టీ నుంచి సస్పెండ్ అవడంతో అనిల్ కుమార్‌ యాదవ్ చాలా సంతోషిస్తూ నెల్లూరు రూరల్, అర్బన్ రెండు నియోజకవర్గాలపై పట్టు పెంచుకొనేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు.

కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరుడు గిరిధర్ రెడ్డి మొన్న టిడిపిలో చేరిపోవడంతో ఇంకా సంతోషిస్తూ, “కొత్తబిచ్చగాడు పొద్దెరగడన్నట్లు కొంతమంది పచ్చ కండువా మెడలో పడగానే రెచ్చిపోతున్నారు. కానీ జగనన్నకి ద్రోహం చేసినవారెవరినీ ప్రజలు క్షమించరు. వచ్చే ఎన్నికలలో నన్ను ఓడిస్తామని కొందరు మంగమ్మ శపధాలు చేస్తున్నారు. కానీ నెల్లూరులో ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు మళ్ళీ గెలిస్తే నేను రాజకీయాల నుంచి తప్పుకొంటాను,” అంటూ అనిల్ కూడా మంగమ్మ శపధం చేశారు.

ADVERTISEMENT

పార్టీలో తనకు ఇబ్బంది కలిగిస్తున్న వారు ముగ్గురూ బయటకు వెళ్ళిపోవడం వలన అనిల్‌కు ఆ మేరకు స్పేస్ పెరిగింది. కానీ అంతమాత్రన్న ఆ మూడు నియోజకవర్గాలు ఖాళీగా ఉండబోవు కదా?వాటిలో ఇప్పటికే మరో ముగ్గురుకి జగన్‌ బాధ్యతలు అప్పగించడం ద్వారా టికెట్స్ ఖరారు చేశారు. కనుక పార్టీలో నుంచి బయటకు వెళ్ళిపోయిన ఆ ముగ్గురితో పాటు ఇప్పుడు వారి స్థానాలలోకి వచ్చి చేరిన ముగ్గురుతో కూడా అనిల్‌కు సమస్యలు మొదలవుతాయి. అంటే అనిల్‌కు శత్రువులు రెట్టింపు అయ్యారన్న మాట!

అనిల్‌కు ఎదురవుతున్న మరో కొత్త సమస్య ఏమిటంటే, ఇదివరకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీలో ఉండేవారు కనుక అనిల్‌తో ఘర్షణలు వద్దనుకొని రూరల్ నియోజకవర్గానికి పరిమితమయ్యేవారు. కానీ ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు కనుక కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సోదరులు ఇద్దరూ నెల్లూరు సిటీలో సభలు, సమావేశాలు నిర్వహిస్తూ పట్టు పెంచుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. కోటంరెడ్డి గిరిధర్ రెడ్డిని నెల్లూరు సిటీ నుంచి టిడిపి అభ్యర్ధిగా బరిలో దింపవచ్చని సమాచారం. అదే కనుక జరిగితే కోటంరెడ్డి సోదరులు ఇద్దరూ కలిసి అనిల్‌ను ఓడించేందుకు గట్టి ప్రయత్నం చేయడం ఖాయం.

అనిల్‌ జగనన్ననే నమ్ముకొన్నప్పటికీ మంత్రి పదవి ఊడగొట్టడమే కాక, జిల్లాకే చెందిన కాకాణి గోవర్ధన్ రెడ్డికి ఆ పదవిని కట్టబెట్టారు. కాకణికి అనిల్‌కు మద్య గొడవలు అందరికీ తెలిసినవే. కనుక వచ్చే ఎన్నికలలో అనిల్‌కు టికెట్‌ రాకుండా చేసి తనవారికి ఇప్పించుకోవాలని కాకాణి ప్రయత్నిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

కనుక అనిల్ తన కుర్చీ కింద మంటలు అంటుకొని ఉండగా, చుట్టూ ఇంతమంది శత్రువులను పెట్టుకొని పార్టీలో నుంచి బయటకు వెళ్ళిన ముగ్గురు ఎమ్మెల్యేలను వచ్చే ఎన్నికలలో గెలవకుండా అడ్డుకొంటానని శపధాలు చేస్తుండటం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఈవిదంగా అతివిశ్వాసంతో వ్యవహరించబట్టే మంత్రి పదవిని పోగొట్టుకొన్నారు. ఇంకా ఇలాగే వ్యవహరిస్తే ఎమ్మెల్యే సీటు కూడా పోగొట్టుకొనే ప్రమాదం ఉంటుందని గ్రహిస్తే మంచిదేమో?

ADVERTISEMENT
Latest Stories