పేద విద్యార్థుల జీవితాలతో చెలగాటం… అవసరమా?

Government-Schools-Andhra-Pradeshవాటికి దీనజనోద్దరణ అనుకోండి లేదా సంక్షేమమనుకోండి… కానీ వైసీపీ ప్రభుత్వం రోజుకో కొత్త ఐడియా చేస్తుంటే అందరూ తలలు పట్టుకొంటున్నారు. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం బైజూస్, టాబ్లెట్స్, పాఠశాలల విలీనం అంటూ విద్యావ్యవస్థపై రకరకాల ప్రయోగాలు చేస్తున్న జగన్ సర్కార్ తాజాగా రాష్ట్రంలో ప్రైవేట్ అన్‌-ఎయిడెడ్, కార్పొరేట్ పాఠశాలలో 1వ తరగతిలో 25 శాతం సీట్లు బడుగు బలహీన వర్గాలకి, అనాధ పిల్లలకి, వికలాంగులకి, హెచ్ఐవి బాధిత విద్యార్థులకి కేటాయించాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

విద్యాహక్కు-2009 ప్రకారం రాష్ట్ర విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ ఈ మేరకు ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. దాని ప్రకారం 25% సీట్లలో వికలాంగులు, అనాధలు, హెచ్ఐవి బాధిత విద్యార్థులకి 5% సీట్లు, షెడ్యూల్డ్ కాస్ట్ పిల్లలకి 10%, షెడ్యూల్డ్ ట్రైబ్ పిల్లలకి 4%, మిగిలిన 6% సీట్లు వార్షిక ఆదాయం రూ.1.20 నుంచి రూ.1.44 లక్షలున్న బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలకి చెందిన పిల్లలకి కేటాయించిన్నట్లు పేర్కొన్నారు.

ADVERTISEMENT

ఇందుకు గాను ప్రభుత్వం పట్టణ ప్రాంతాలలో ఉండే పాఠశాలలో ఒక్కో విద్యార్ధికి రూ.8,000, గ్రామీణ ప్రాంతాలలో ఉండే పాఠశాలలో ఒక్కో విద్యార్ధికి రూ.6,500, మారుమూల ప్రాంతాలలో ఒక్కో విద్యార్ధికి రూ.5,100 చొప్పున చెల్లిస్తుంది. అడ్మిషన్ల కోసం, ఆ తర్వాత పిర్యాదుల కోసం ప్రభుత్వం హెల్ప్ లైన్ నంబర్ 14417ని ఏర్పాటు చేసింది.

పేదవిద్యార్ధులకి కూడా నాణ్యమైన విద్య అందించాలనే ఆలోచన అభినందనీయమే. అయితే ప్రభుత్వ పాఠశాలలో చేస్తున్న ప్రయోగాలతో కార్పొరేట్ పాఠశాలకి తీసిపోనిస్థాయిలో పిల్లలకి నాణ్యమైన చదువులు అందిస్తున్నామని చెప్పుకొంటున్నప్పుడు, మళ్ళీ కార్పొరేట్ కళాశాలలకి పంపించడం దేనికి?ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలో మద్యతరగతి లేదా ఆ పై స్థాయి కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలు చదువుకొంటారు. వారి మద్యలో నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన పిల్లలని పంపితే వారు తోటి విద్యార్థుల నుంచి అవహేళనకి గురవరా? అప్పుడు ఆ పసివయసులోనే వారిలో ఆత్మన్యూనత ఏర్పడకుండా ఉంటుందా?

వరంగల్‌, కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ మొదటి సంవత్సరం చేస్తున్న డాక్టర్ ధారావత్ ప్రీతి అనే యువతి, ఓ జగిత్యాల జిల్లాలో మారుమూల గ్రామానికి చెందిన గిరిజన కుటుంబం నుంచి వచ్చినందున, తోటి విద్యార్థులు, సీనియర్స్ ఆమెని అవమానించి వేధించడంతో ఆత్మహత్య చేసుకొన్న వార్త బహుశః అందరూ చదివే ఉంటారు. మెడికల్ పీజీ స్థాయి చేరుకొన్న విద్యార్ధినికే అవమానాలు తప్పకపోతే 1వ తరగతి పిల్లల పరిస్థితి ఏమిటి? అనే సందేహం కలుగుతుంది.

వేలు, లక్షల రూపాయలు డొనేషన్స్ వసూలు చేస్తున్న ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలని 25 శాతం సీట్లని ప్రభుత్వం సూచించినవారికి ఇమ్మనమని హుకుం జారీచేయగలదు. కానీ మిగిలిన వారితో సమానంగా ఆ నిరుపేద పిల్లలకి పాఠాలు చెప్పించి రాణించేలా చేయగలదా?వేలు, లక్షలు డొనేషన్లు, ఫీజులు చెల్లించి ప్రైవేట్, కార్పొరేట్ కళాశాలలో చదివించుకొంటున్న తల్లితండ్రులు తమ పిల్లలని అనాధలు, వికలాంగులు, హెచ్ఐవి బాధిత విద్యార్థులతో కలిసి చదువుకొనేందుకు అంగీకరిస్తారా?మిగిలిన పిల్లలతో వారికీ సమాన గౌరవం, సమాన అవకాశాలు ప్రభుత్వం కల్పించగలదా?లేకుంటే వారి పరిస్థితి ఏమిటి? ఆ పసిపిల్లల జీవితాలతో అందరూ కలిసి ఆడుకొంటున్నట్లే అవుతుంది కదా?

ADVERTISEMENT
Latest Stories