భారత్లో మరే రాష్ట్రం సాధించలేనంత భారీ పెట్టుబడులు, పరిశ్రమలని వైసీపీ ప్రభుత్వం కేవలం రెండు రోజుల గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో సాధించింది. ఎందుకంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ నెంబర్:1 స్థానంలో ఉంది. మంచి దార్శనికత (విజన్) ఉన్న జగన్మోహన్ రెడ్డి ఏపీకి ముఖ్యమంత్రిగా ఉన్నారు కనుక!
తొలిరోజు సదస్సులో రూ.11.88 లక్షల కోట్లు విలువైన ఒప్పందాలు చేసుకొన్న వైసీపీ ప్రభుత్వం, శనివారం రెండో రోజున వివిద కంపెనీలతో రూ.1.15 లక్షల కోట్ల విలువైన 248 ఎంవోయులు చేసుకొంది.
ఈరోజు సదస్సులో రిలయన్స్ సంస్థ రూ.50,000 కోట్లు పెట్టుబడి పెట్టగా తర్వాత స్థానంలో హెచ్పీసీఎల్ ఎనర్జీ రూ.14,500 కోట్లు పెట్టేందుకు ఎంవోయు చేసుకొంది. ఆ తర్వాత టీవీఎస్ కంపెనీ రూ.1,500 కోట్లు, ఎకో స్ట్రీల్స్ రూ.894 కోట్లు బ్లూస్టార్ రూ.890 కోట్లకి ఎంవోయు చేసుకొన్నాయి. ఈ పెట్టుబడులతో పోల్చి చూసినప్పుడు రూ.100-200 కోట్లు పెట్టుబడులు పెట్టబోతున్న కంపెనీల గురించి పెద్దగా చెప్పుకోనవసరం లేదనిపిస్తుంది.
ఈ రెండు రోజులలో మొత్తం రూ.13 లక్షల కోట్ల పెట్టుబడితో 342 పరిశ్రమలు ఏపీలో రాబోతున్నాయి. అవన్నీ రాబోయే ఎన్నికలలోగా ఏర్పాటైపోతే రాష్ట్రంలో ఒకేసారి 6 లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి. ఒకవేళ ఏ కారణం చేతైనా ఏర్పాటు కాకపోతే ఎలాగూ 175 సీట్లతో వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తుందని సిఎం జగన్మోహన్ రెడ్డి చెపుతున్నారు కనుక అప్పుడు తప్పకుండా అన్ని పరిశ్రమలు ఏర్పాటవుతాయి. ఎందుకంటే జగనన్న మాట తప్పరు… మడమ తిప్పరని అందరికీ తెలుసు.
ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి ఇటీవల హైదరాబాద్లో ఫార్ములా ఈ-రేసింగ్ ఈవెంట్ చూసేందుకు వెళ్లినప్పుడు అక్కడ ఆయన ‘కోడి-గుడ్డు కధ’ చెప్పారని ప్రతిపక్షాలు ఎద్దేవా చేశాయి. కానీ ఈరోజు ఆయన సూటు-బూటు ధరించి టీవిగా సదస్సులో ప్రసంగిస్తుంటే చాలా ముచ్చటేసింది. నిరాడంబరంగా తెల్ల ఖద్దరు దుస్తులు ధరించి మాట్లాడే మన మంత్రి గుడివాడగారి గొప్పదనం గ్రహించలేని ప్రజలు పట్టించుకోలేదు కానీ ఈరోజు ఆయన సదస్సులో టీవిగా మాట్లాడుతుంటే పారిశ్రామికవేత్తలు మురిసిపోతూ చప్పట్లు కొట్టారు.
సిఎం జగన్మోహన్ రెడ్డి ఇమేజ్ చూసే పెట్టుబడిదారులు ఏపీలో పరిశ్రమల స్థాపనకి క్యూ కట్టారని మంత్రి గుడివాడ చెప్పారు. అయితే ఈవిషయం ఆయన మూడున్నరేళ్ళ ఆలస్యంగా తెలుసుకోవడం వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్ని లక్షల కోట్లు లేదా కోట్ల కోట్లు పెట్టుబడులు నష్టపోయిందో తలచుకొంటే చాలా బాధేస్తుంది. కానీ మంత్రి గుడివాడ లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చారు కనుక రెండు రోజుల సదస్సులో ఏపీకి 13 లక్షల కోట్లు తెచ్చిపెట్టినందుకు చాలా సంతోషించవలసిందే. ఎన్నికలు జరిగేలోగా మరోసారి సదస్సు నిర్వహించుకోగలిగితే ఇక ఏపీ దరిద్రం పూర్తిగా వదిలిపోతుంది.



