వాలంటీర్లకి ఆ అర్హత ఉందా?అసలు వాళ్ళెవరు?

High Courtవైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తమ పార్టీ కోసం పనిచేసేందుకు వాలంటీర్ వ్యవస్థని సృష్టించి ఏటా వారిపై వందలకోట్లు ఖర్చు చేస్తోంది. ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలని ఇంటింటికీ అందించడం, ప్రజల సమస్యలని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరింపజేసేందుకే వాలంటీర్ వ్యవస్థ అని వైసీపీ ప్రభుత్వం చెప్పుకొంటున్నప్పటికీ వారిని పార్టీ అవసరాలకి వాడుకొంటున్నట్లు మంత్రులు, ఎమ్మెల్యేల మాటలతో పలుమార్లు బయటపడింది. సంక్షేమ పధకాలనే తాయిలాలని వారి ద్వారా ప్రజలకి పంచిపెడుతూ ప్రజలని ప్రభావితం చేస్తూ, వైసీపీకి ఓట్లు వేసేలా చేయడమే వాలంటీర్ల ప్రధానబాధ్యత అని వేరే చెప్పక్కరలేదు.

ADVERTISEMENT

పల్నాడు జిల్లా పెదకూరపాడు మండలంలోని గారపాడు గ్రామానికి చెంసిన 27 మంది వైఎస్సార్ చేయూత లబ్ధిదారులు హైకోర్టులో ఓ పిటిషన్‌ వేశారు. తమకి ఇదివరకు వైఎస్సార్ చేయూత లభించేదని కానీ రాజకీయ కారణాలతో వాలంటీర్ సూచన మేరకు తమకి ఆ పధకం నిలిపివేశారని వారు ఫిర్యాదు చేశారు.

ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ట్ దేవానంద్ భట్టు కొన్ని ఆసక్తికరమైన ప్రశ్నలు వేశారు. సంక్షేమ పధకాల లబ్ధిదారులని ఎవరు గుర్తిస్తారు? అర్హులైన లబ్ధిదారులని గుర్తించే బాధ్యత ఆయా శాఖల అధికారులు, పంచాయతీ కార్యదర్శులదే కదా? మరి వాలంటీర్లు ఏ హోదాతో లబ్ధిదారులని గుర్తిస్తున్నారు?ఏ అధికారంతో లబ్ధిదారులకి పధకాలు నిలిపివేయిస్తున్నారు?అసలు వాలంటీర్ వ్యవస్థకున్న చట్టబద్దత ఏమిటి?” అని నిలదీశారు.

దీనిపై సచివాలయశాఖ ప్రత్యేక కమీషనర్ దాఖలు చేసిన కౌంటర్‌లో సంక్షేమ పధకాల లబ్ధిదారుల గుర్తింపు, ఎంపిక, పధకాల రద్దులో వాలంటీర్ల ప్రమేయం లేదని చెప్పగా, గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ఫ్) సీఈవో ఇంతియాజ్ దాఖలు చేసిన మరో కౌంటర్‌లో, సంక్షేమ పధకాల లబ్ధిదారుల గుర్తింపుకి వాలంటీర్ల సేవలని వినియోగించుకొంటున్నామని, లబ్ధిదారులని గుర్తించి, ఖరారు చేసేందుకు ఆరు అంచెల విధానాన్ని అమలుచేస్తున్నామని హైకోర్టుకి తెలిపారు.

వైసీపీ ప్రభుత్వం వాలంటీర్ల వ్యవస్థని పార్టీ అవసరాల కోసమే సృష్టించిందనేది అందరికీ తెలిసి రహస్యం. కానీ న్యాయస్థానం ఆ వ్యవస్థని ఉనికిని, చట్టబద్దతని ప్రశ్నిస్తోందే తప్ప రద్దు చేయడం లేదు కనుకనే అది నిరాటంకంగా కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. ఈ కేసు విచారణ సందర్భంగా హైకోర్టు మళ్ళీ అవే ప్రశ్నలు వేసింది.

అయితే ఈసారి గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ (సెర్ఫ్) సీఈవో ఇంతియాజ్‌ వాలంటీర్ వ్యవస్థని లబ్ధిదారుల గుర్తింపుకి వాడుకొంటున్నామని లిఖితపూర్వకంగా తెలిపి దొరికిపోయారు కనుక తదుపరి విచారణలో ఈ వాలంటీర్ వ్యవస్థపై హైకోర్టులో మరింత ఆసక్తికరమైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఈనెల 28వ తేదీన విచారణకి స్వయంగా హాజరయ్యి వివరణ ఇవ్వాలని సెర్ఫ్ సీఈవో ఇంతియాజ్‌ని హైకోర్టు ఆదేశించింది.

వైసీపీ ప్రయోజనాల కోసమే సృష్టించబడిన ఈ వాలంటీర్ వ్యవస్థని తదుపరి ప్రభుత్వాలు అయిష్టంగానైనా పోషించక తప్పని పరిస్థితి కూడా వైసీపీ ప్రభుత్వం కల్పించింది. యువగళం పాదయాత్ర చేస్తున్న టిడిపి యువనాయకుడు నారా లోకేష్‌ ఇదే ప్రశ్న ఎదుర్కొన్నప్పుడు టిడిపి అధికారంలోకి వచ్చినా ఈ వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తామని చెప్పవలసిరావడమే ఇందుకు నిదర్శనం.

ADVERTISEMENT
Latest Stories