ఇరాన్ యుద్ధ సంక్షోభంతో చమురు సఫరఫా నిలిచిపోవడంతో భారత్తో సహా పలు దేశాలు ఇబ్బంది పడుతున్నాయి. వందలాది చమురు నౌకలు ఎక్కడివక్కడ నిలిచిపోయాయి.
భారత్ వద్ద మరో నెల రోజులకు సరిపడే చమురు నిల్వలు ఉన్నప్పటికీ అవి కరిగిపోయేలోగా మళ్ళీ సిద్ధం చేసుకోక తప్పదు.
ఈ నేపధ్యంలో భారత్ అభ్యర్ధన మేరకు నేటి నుంచి 30 రోజుల పాటు రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేసేందుకు అనుమతిస్తున్నట్లు అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. యుద్ధ సంక్షోభం కారణంగా మిత్ర దేశమైన భారత్ ఇబ్బంది పడకూడదనే సదుదేశ్యంతోనే అనుమతిస్తున్నట్లు తెలిపారు.
అయితే సముద్రంలో నిలిచిపోయిన రష్యా ముడిచమురు నౌకల నుంచి మాత్రమే చమురు కొనుగోలు చేయాలని షరతు విధించింది. ఈ కొనుగోలు వలన రష్యాకు పెద్దగా ఆర్ధిక ప్రయోజనం ఉండదు కనుక అనుమతిస్తున్నట్లు తెలిపారు. యుద్ధం ముగిసిన తర్వాత అమెరికా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు పెంచుతుందని ఆశిస్తున్నామన్నారు.
అమెరికా చేసిన ఈ ప్రకటనతో భారత్ చమురు కంపెనీలకు, ముఖ్యంగా చమురు ధరలు విపరీతంగా పెరిగిపోతాయని ఆందోళన చెందుతున్న భారతీయులకు చాలా ఉపశమనం లభిస్తుంది. ఓ పక్క అమెరికా-ఇరాన్ మద్య యుద్ధం రోజురోజుకీ తీవ్రమవుతున్నప్పటికీ తాజా ప్రకటనతో భారతీయ షేర్ మార్కెట్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంది.
ట్రంప్ వద్దంటే మానేయాలి… ఇస్తే తీసుకోవాలి.. ఎవరి దగ్గర తీసుకోమంటే వారి దగ్గరే తీసుకోవాలి! ఎంతిస్తే అంతే తీసుకోవాలి! దట్సీజ్ ఇట్!




