తెలంగాణ లో తెలంగాణవాదం ఇంకా సజీవంగా ఉందా.? లేదా రాజకీయ నాయకులే ఆ ప్రాంతీయవాదాన్ని సజీవంగా ఉంచాలని భావిస్తున్నారా.? కోనసీమకు తెలంగాణ దిష్టి తగిలింది అన్న పవన్ వ్యాఖ్యలను పట్టుకుని తెలంగాణ రాజకీయ పార్టీలు, ఆయా పార్టీల నాయకులు దాన్ని ప్రాంతీయవాద రాజకీయంగా మలిచారు.
ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో ఉన్న పవన్ కళ్యాణ్ ఈ విధంగా తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బ తీస్తారా.? వెంటనే పవన్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని తెలంగాణ వారికి క్షమాపణలు చెప్పాలి,లేకుంటే తెలంగాణలో పవన్ సినిమాలను ఆడనివ్వం,
పవన్ వ్యాఖ్యలు తెలంగాణ ప్రజలను అవమానించేలా ఉన్నాయి అంటూ అధికార కాంగ్రెస్ నుంచి జాగృతి కవిత తో సహా ప్రతిపక్ష బిఆర్ఎస్ వరకు పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు, ఆయన సినిమాల పై వేటు అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
అయితే తెలంగాణ నాయకులు ఇంతలా హడావుడి చేసిన వ్యాఖ్యల పై అసలు తెలంగాణ ప్రజలు కనీసం దృష్టి పెట్టారా అంటే దానికి తెరిచిన నోర్లు రెండు రోజులకే మూసుకోవడమే ప్రత్యక్ష సాక్ష్యం గా నిలిచింది. నిజంగా నాయకుల మాదిరి ప్రజలలో కూడా ఇదే భావన ఉండి ఉంటే మంత్రుల నుంచి పవన్ సినిమాలకు వచ్చిన బెదిరింపు కాల్స్ ఇకటి రెండు రోజులకే సద్దుమణిగేవా.?
బిఆర్ఎస్, కాంగ్రెస్, కవిత ఎత్తుకున్న ప్రాంతీయవాద రాజకీయం రోజు గడిచేసరికే నోరు మూసేదా.? అంటే తెలంగాణ వాదం అనేది కేవలం రాజకీయ నాయకులకు అవసరమైన ఒక రాజకీయ అస్త్రం మాత్రమే కానీ అది తెలంగాణ ప్రజల మనోభావం కాదు అనేది సుస్పష్టమయ్యింది.
అలాగే తాజాగా టాలీవుడ్ ప్రముఖ సింగర్ బాల సుబ్రహ్మణ్యం విగ్రహ ఏర్పాటు విషయంలో కూడా ఇదే తరహా ఆంధ్రా – తెలంగాణ అంటూ కొంతమంది ప్రాంతీయవాదాన్ని రెచ్చకొట్టే ప్రయత్నం చేసారు.
తెలంగాణలో ఆంధ్రా గాయకుడి విగ్రహమా.? అంటూ రాష్ట్రం విడిపోయిన దశాబ్దం తరువాత కూడా ఒక కళాకారుడిని ఇలా ఆంధ్రోడు, తెలంగాణవాడు అంటూ వేలెత్తి చూపుతూ మానసికంగా కూడా తెలుగు జాతిని రెండుగా విడకొట్టే ప్రయత్నం చేసారు.
అయితే దానికి వినూత్నంగా బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ, జాగృతి అధ్యక్షురాలు కవిత కూడా వంత పాడుతూ బాల సుబ్రహ్మణ్యం గతంలో జయ జయహో తెలంగాణ అనే పాట పాడడానికి నిరాకరించారు అనే ప్రచారం ఒకటి తెలంగాణలో చాల బలంగా వినిపించింది.
ఇందులో వాస్తవం ఎంతో తెలియదు కానీ, అటువంటి వారి విగ్రహాన్ని తెలంగాణ జానపద గాయకుల కోసం ఏర్పాటు చేసిన రవీంద్ర భారతిలో పెట్టడం సమంజసం కాదు అంటూ కవిత బాలు విగ్రహ ఏర్పాటు పై వేర్పాటు వాదాన్ని వ్యక్తపరిచారు.
అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏపీ – తెలంగాణ అంటూ రెండుగా విడిపోయి పదేళ్లు పూర్తయినా ఏపీలో లేని ప్రాంతీయవాద రాజకీయం తెలంగాణలోనే ఎందుకు.? దానికి కారణం ఇక్కడి నాయకులా.? ప్రజలా.?
లేక ప్రజలలో లేని ఈ వాదాన్ని రాజకీయ పార్టీలు వారి స్వలాభం కోసం ప్రజల పై బలవంతంగా రుద్ది రెండు రాష్ట్రాల మధ్య ఈ ప్రాంతీయవాదం అనే రాజకీయానికి మరోమారు నిప్పు రాజేయాలని చూస్తున్నారా.?




