టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇదివరకు తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో ఎప్పుడు కావాలనుకొంటే అప్పుడు స్వేచ్ఛగా పర్యటించేవారు. కానీ ప్రభుత్వం కొత్త జీవో తెచ్చిన తర్వాత ఆయన అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా మారింది. అడుగడుగునా అడ్డుపడుతున్న పోలీసులతో వాగ్వాదాలు చేస్తూ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులలో పర్యటన కొనసాగించవలసివస్తోంది. చంద్రబాబు నాయుడి పర్యటనకే ఈ పరిస్థితి ఉంటే, రేపు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శ్రీకాకుళం జిల్లా పర్యటన ఇంకెంత కష్టమో ఊహించుకోవచ్చు.
ఈనెల 12న స్వామి వివేకానంద జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా, రణస్థలంలో జనసేన అధ్వర్యంలో యువశక్తి అనే కార్యక్రమం నిర్వహించేందుకు జనసేన ఏర్పాట్లు చేసుకొంటోంది. ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించేందుకు ఉత్తరాంద్ర జనసేన నేతలు, కార్యకర్తలు బ్యానర్లు, పార్టీ జెండాలు, తోరణాలు, ప్రచార సామాగ్రిని సిద్దం చేసుకొంటున్నారు. సభా వేదికని కూడా ఖరారు చేసుకొన్నారు.
ప్రతీసారి సభలలో నేతలు మాట్లాడితే ప్రజలు వింటారని, కానీ ఈ యువశక్తి కార్యక్రమంలో యువత, ముఖ్యంగా కాలేజీ విద్యార్దులు పాల్గొని వర్తమాన రాజకీయాలు, ప్రజాసమస్యలు, చదువులు, ఉద్యోగం, ఉపాధి తదితర అంశాల గురించి తమ ఆలోచనలను, అభిప్రాయాలను అందరితో పంచుకొంటారని పవన్ కళ్యాణ్ చెప్పారు.
ఇంత వరకు బాగానే ఉంది. పవన్ కళ్యాణ్ సభ అంటే ఉత్తరాంద్రలో అన్ని జిల్లాల నుంచి వేలాదిమంది అభిమానులు, జనసేన కార్యకర్తలు కూడా తరలివస్తారు. మరోపక్క ప్రభుత్వం జారీ చేసిన కొత్త జీవో సిద్దంగా ఉండనే ఉంది. దాంతో చంద్రబాబు నాయుడినే ముప్పతిప్పలు పెడుతున్న పోలీసులు, వైసీపీకి బద్ద శత్రువైన పవన్ కళ్యాణ్ని సజావుగా కార్యక్రమం చేసుకొనిస్తారనుకోలేము. జీవో పేరుతో వీరసింహారెడ్డి, వాల్తేర్ వీరయ్యలనే కట్టడి చేసినప్పుడు జనసేనని కట్టడి చేయకుండా ఉంటారనుకోలేము.
కనుక ఈ కార్యక్రమం అసలు జరుగుతుందో లేదో… జరిగితే ఏవిదంగా జరుగుతుందో ఊహించడం కష్టమే. కానీ జనసేన నేతలు, కార్యకర్తలు మాత్రం జీవో గురించి ఆలోచించకుండా యువశక్తి సభకి చకచకా ఏర్పాట్లు చేసుకొంటున్నారు. కనుక జనవరి 12న మరో బిగ్ ఫైట్ జరిగే అవకాశం కనిపిస్తోంది.



