దావోస్ ప్రపంచ ఆర్ధిక సదస్సులో తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్, ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి ఇద్దరూ కలిసి ఆప్యాయంగా మాట్లాడుకొని ఫోటోలు దిగారు. కొన్ని రోజుల క్రితమే అసమర్ధత ఏపీ ప్రభుత్వం కారణంగా ఏపీలో పరిస్థితి దయనీయంగా మారిందంటూ చులకనగా మాట్లాడిన మంత్రి కేటీఆర్, “సోదరుడు జగన్తో గొప్ప సమావేశం జరిగిందంటూ,” ట్వీట్ చేస్తూ తమ ఫోటోలు షేర్ చేశారు. దానిపై నెటిజన్స్ స్పందన ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆవేదనకు అద్దం పట్టేవిగా, చాలా ఆలోచింపజేసేవిగా, ఉన్నాయి.
ఓ నెటిజన్ “గుడ్! ఒకరు (కేటీఆర్) తమ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి చురుకుగా పనిచేస్తుంటే మరొకరు (జగన్)తమ రాష్ట్రంలో పారిశ్రామిక విధ్వంసం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఏపీ నుంచి పోటీ ఉండకూడదనే ప్లానులో భాగంగానే ఏపీకి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి అయ్యేందుకు కేటీఆర్ గారు సహకరించారా?మీ ఈ వ్యూహంతో తెలంగాణ రాష్ట్రం లాభపడుతుండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి శాపంగా మారింది. పండగ చేసుకోండి,” అని ట్వీట్ చేశారు.
మరో వ్యక్తి కేటీఆర్-జగన్ ఫోటోపై ట్విట్టర్లో స్పందిస్తూ, “కేటీఆర్ సార్.. మీ ఇంట్లో సిఎం జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకొని రోజూ పూజిస్తుండాలి. ఎందుకంటే జగన్ చెత్త పాలన కారణంగానే మీ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. అదే…ఏపీలో టిడిపి అధికారంలో ఉండి ఉంటే ఈరోజు మీ తెలంగాణ పరిస్థితి (పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి) ఏవిదంగా ఉండేదో మీకు తెలిసే ఉంటుంది” అని వ్యంగ్యంగా మెసేజ్ పెట్టారు.
మరో నెటిజన్, “ ఇంతకీ మీ సమావేశంలో దేని గురించి చర్చించుకొన్నారు? అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల గురించా?విద్యుత్ బకాయిల గురించా?ఆర్టీసీ ఆస్తుల పంపకాల గురించా?గ్రేటర్ రాయలసీమకు నీళ్ళు అందించడం గురించా? ప్రైవేట్ కంపెనీలలో వాటాలు పంచుకోవడం గురించా?దేని గురించి మీరు మాట్లాడుకొన్నారు? ఒకరు ఆరోగ్య రంగం గురించి మాట్లాడుతూ ఆ రంగంలో కూడా మేము యుద్ధానికి సిద్దమన్నట్లు మాట్లాడితే మరొకరు అంతర్జాతీయ ప్రమాణాల గురించి మాట్లాడారు… గ్రేట్,” అని ట్వీట్ చేశారు.



