ఏపీ బిజెపి మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ ప్రస్తుత అధ్యక్షుడు సోమూ వీర్రాజుపై తీవ్ర విమర్శలు చేశారు. ఏపీలో బిజెపిని బలోపేతం చేసేందుకు కృషిచేయాల్సిన సోమూ వీర్రాజు, పార్టీని ఓ పద్దతి ప్రకారం నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అందుకే పలువురు పార్టీని వీడి వెళ్ళిపోతున్నారని కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. దానిలో భాగంగానే గతంలో తాను అధ్యక్షుడుగా ఉన్నప్పుడు నియమించిన జిల్లా అధ్యక్షులందరినీ సోమూ వీర్రాజు తొలగిస్తున్నారని ఆరోపించారు. ఏపీలో జిల్లా బిజెపి అధ్యక్షుల మార్పు గురించి ఎవరితో చర్చించకుండా ఏకపక్ష నిర్ణయం తీసుకొన్నారని కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు.
ఏపీలో కాపులని సమైక్యపరుస్తున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ని, అక్కడ తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకువచ్చేందుకు తీవ్రంగా కృషి చేస్తున్న బండి సంజయ్ని దెబ్బ తీసేందుకు ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు కుట్రలు చేస్తున్నారని కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో బిజెపిని దెబ్బ తీసేందుకు, కాపుల ఓట్లు చీల్చేందుకు ఇరువురు ముఖ్యమంత్రులు ప్రయత్నిస్తుంటే సోమూ వీర్రాజు వియ్యంకుడు వెళ్ళి బిఆర్ఎస్ పార్టీలో చేరారని, దీనికి సోమూ వీర్రాజు ఏం సమాధానం చెపుతారని కన్నా లక్ష్మినారాయణ ప్రశ్నించారు.
కేసీఆర్, జగన్ ఇద్దరూ బిఆర్ఎస్ పార్టీని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేస్తూ తమ అధికారం నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తుంటే వారిని ధీటుగా ఎదుర్కోవలసిన సోమూ వీర్రాజు కూడా బిజెపికి నష్టం కలిగిస్తున్నారని కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు.
ఈ సందర్భంగా కన్నా లక్ష్మినారాయణ బిజెపి ఎంపీ జీవీఎల్ని కూడా తీవ్రంగా విమర్శించారు. ఆయన మాట్లాడే మాటలు ఎప్పుడూ ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగానే ఉంటాయన్నారు. రాజధాని అమరావతి, రోడ్లపై రాజకీయ పార్టీల రోడ్ షోలని నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై ఆయన స్పందించిన తీరే ఇందుకు నిదర్శనమని కన్నా లక్ష్మినారాయణ ఆరోపించారు.
రాష్ట్రంలో రాజకీయ పార్టీలు కాపులను కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నాయని కానీ పవన్ కళ్యాణ్ ఒక్కరే వారికి రాజ్యాధికారం కల్పించేందుకు గట్టిగా కృషి చేస్తున్నారని అన్నారు. పవన్ కళ్యాణ్ చేస్తున్న ఈ పోరాటానికి తన సహాయసహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని కన్నా లక్ష్మినారాయణ చెప్పారు. అంటే ఆయన త్వరలో జనసేన పార్టీలో చేరే అవకాశం ఉందని భావించవచ్చు.



