తెలంగాణ జాతిపిత, తెలంగాణ గాంధీ, అపర భగీరధుడు, అపర చాణక్యుడు, దేశ్ కీ నేత ఇలా…. ఒకటా రెండా… అనేక బిరుదులున్నాయి ఆయనకు. ఏడు వేలో… డబ్బై వేలో పుస్తకాలు చదివిన మహా మేధావి అయన.
అలాంటి వ్యక్తి సొంత పార్టీని కాపాడుకోలేకపోతున్నారా? సొంత కుటుంబంలో గొడవలు పరిష్కరించకలేకపోతున్నారా? అంటే కాదనే అంటున్నారు తెలంగాణ మంత్రి సీతక్క.
కేసీఆర్ నిజంగానే తన పార్టీని, కుటుంబాన్ని చక్కబెట్టుకోలేకపోతున్నారంటే నమ్మశక్యంగా లేదన్నారు. ప్రస్తుతం కవిత-బీఆర్ఎస్ మద్య జరుగుతున్నవి ఉత్తుత్తి యుద్ధాలని, కేసీఆర్ తన రాజకీయ ప్రత్యర్ధులను తికమక పెట్టడానికే కూతురు చేత ఈ కొత్త డ్రామా మొదలుపెట్టించారని ఆమె అభిప్రాయపడ్డారు.
ఈ హడావుడితో కాళేశ్వరం కేసుపై నుంచి అందరి దృష్టి మళ్ళించాలని ఆశ పడుతున్నారని కానీ సీబీఐ రంగంలో దిగితే ఆయనని, అయన పరువుని ఎవరూ కాపాడలేరన్నారు.
కానీ పార్టీకి మూల స్థంభం, తనకు అత్యంత నమ్మకస్తుడైన హరీష్ రావుపై కూతురు చేత ఇటువంటి ఆరోపణలు చేయిస్తే నష్టపోయేది బీఆర్ఎస్ పార్టీయే కదా?కనుక కేసీఆర్ ఇటువంటి చారిత్రిక తప్పిదం ఎన్నటికీ చేయరు. కనుక కవిత తనకు జరిగిన అన్యాయానికి ఆవేదనతోనే ఈ మాటలన్నట్లు భావించవచ్చు.
కానీ కేసీఆర్ కూతురు కవితని ఇప్పుడు బయటకు పంపించినా, తర్వాత ఏదో రోజు ఆమె తిరిగి వస్తే పార్టీలో చేర్చుకోకుండా ఉండరు. ఇతర పార్టీలలోకి వెళ్ళిన నేతలు తిరిగి వస్తేనే అక్కున చేర్చుకుంటున్న కేసీఆర్, కూతురు తిరిగి వస్తే చేర్చుకోకుండా ఉంటారా?
అయితే అది ఇప్పుడప్పుడే కాదు. దానికీ ఓ సమయం, సందర్భం, బలమైన కారణం ఉన్నాయి.
ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ పరువు పోగొట్టుకొని, బలహీనపడి ఉంది. ఒకవేళ సీబీఐ కేసు మొదలైతే పార్టీ పరిస్థితి మరింత దిగజారుతుంది.
అప్పటికి తెలంగాణ జాగృతితో కవిత సిద్దంగా ఉంటే, పార్టీ నేతలు దానిలోకే వెళతారు తప్ప కాంగ్రెస్, బీజేపిల వైపు చూడరు. ఆవిధంగా బీఆర్ఎస్ పార్టీని కాపాడుకోవచ్చు.
ఒకవేళ వచ్చే ఎన్నికలలోగా పార్టీ పరిస్థితి మెరుగుపడకపోతే కేసీఆర్కి ఆత్మ వంటి తెలంగాణ జాగృతితో కూతురు కవిత సిద్దంగానే ఉంటారు.
ఒకవేళ ఆలోగా బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి మెరుగుపడితే ఎన్నికలలో బీఆర్ఎస్-జాగృతీ రెండూ కత్తులు దూసుకుంటూ కాంగ్రెస్, బీజేపి ఓట్లు చీల్చి పంచుకోగలిగితే, ఆనక మళ్ళీ కలిసిపోవచ్చు.
కనుక కవిత సస్పెన్షన్ ప్లాన్-బీ అనుకోవచ్చు. అవునా కాదా తెలియాలంటే మరికొన్ని రోజులు ఎదురు చూడాలి.





