టిడిపిలోకి ఆ నలుగురే… మరొక్కరు కూడా రారట!

Kodali-Nani-Challenges Chandrababu-Naidu-ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలతో షాక్ తిన్న సిఎం జగన్మోహన్ రెడ్డిని ఓదార్చేందుకు మంత్రులు, మాజీలు, ఎమ్మెల్యేలు పోటీ పడుతున్నారు. ఆ ప్రయత్నంలో టిడిపిపై విరుచుకుపడుతున్నారు. మళ్ళీ మంత్రివర్గ విస్తరణ ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తుండటంతో మంత్రి పదవి పోగొట్టుకొన్న కొడాలి నాని, అసంతృప్తిగా ఉన్న కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వంటివారు కూడా మీడియా ముందుకు వచ్చి గట్టిగా మాట్లాడుతున్నారు.

ADVERTISEMENT

మాజీగా మారిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ, “ఇది వరకు వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను టిడిపిలోకి తీసుకొన్నందుకు, 2019 ఎన్నికలలో 23 మంది టిడిపి ఎమ్మెల్యేలు మాత్రమే గెలిచారు. ఇదీ దేవుడి స్క్రిప్ట్. మళ్ళీ ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలను తీసుకొన్నారు కనుక 2024లో టిడిపికి నలుగురే ఎమ్మెల్యేలుగా గెలుస్తారు. వైసీపీ నుంచి టిడిపిలోకి వెళుతున్న ఆ నలుగురు మాత్రం ఎట్టి పరిస్థితులలో గెలవరు. వేరెవరో నలుగురు గెలుస్తారు. దేవుడి స్క్రిప్ట్ ఈవిదంగానే ఉండబోతోంది,” అని జోస్యం చెప్పారని అనడం కంటే శాపనార్ధాలు పెట్టారని చెప్పుకోవచ్చు. టిడిపి నాలుగు సీట్లే గెలుచుకొంటుందటూ అధినేత మనసుకు నచ్చే మాట చెప్పారు కనుక మరి కొడాలి నానిని మళ్ళీ మంత్రివర్గంలోకి తీసుకొంటారా? చూడాలి.

వచ్చే ఎన్నికలలో 175 సీట్లు మేమే గెలుచుకొంటామని సిఎం జగన్‌ బల్లగుద్ది చెపుతున్నప్పుడు, వాటిలో నాలుగు సీట్లు టిడిపికి వెళ్లిపోతాయని కొడాలి నాని చెపుతున్నారు. అంటే అప్పుడే లెక్క తప్పుతోందన్న మాట!

నెల్లూరు వైసీపీలో అసంతృప్తిగా ఉన్న కోవూరు వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “వైసీపీలోని 40 మంది ఎమ్మెల్యేలు టిడిపితో టచ్చులో ఉన్నారంటూ చంద్రబాబు నాయుడు మైండ్ గేమ్ ఆడుతున్నారు కానీ దానిలో నిజం లేదు. ఆయనకు ఇలాంటి మైండ్ గేమ్స్ ఆడటం అలవాటే. దమ్ముంటే టిడిపితో టచ్చులో ఉన్న ఆ 40 మంది ఎమ్మెల్యేల పేర్లు ప్రకటించాలి. ఆ నలుగురు తప్ప మరొక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా టిడిపిలో చేరే అవకాశం లేదు,” అని అన్నారు.

ఐ-ప్యాక్ సర్వేలు చేసి, ఇచ్చిన నివేదికను చేతిలో పట్టుకొని జగన్మోహన్ రెడ్డి, 30-40 మంది ఎమ్మెల్యేలను పనితీరు మెరుగు పరుచుకోవాలని లేకుంటే టికెట్స్ ఇవ్వనని, అప్పుడు బాధపడి తనను నిందించి ప్రయోజనం ఉండదని పదేపదే హెచ్చరించిన్నట్లు సొంత మీడియాలోనే వార్తలు వచ్చాయి. కానీ కొంతమంది మంత్రులతో సహా చాలామంది ఎమ్మెల్యేల తీరు మారలేదని కూడా వార్తలు వచ్చాయి. మరి వారికి టికెట్‌ ఇవ్వకపోతే వారు వైసీపీనే అంటిపెట్టుకొని ఉంటారా?

మూడు రాజధానులతో వేడెక్కి ఉన్న రాయలసీమ, ఉత్తరాంద్ర జిల్లాలలో సైతం చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనలకు, నారా లోకేష్‌ పాదయాత్రకు లభిస్తున్న ప్రజాధారణ చూస్తే ప్రభుత్వం మార్పు అనివార్యమని స్పష్టం అవుతోంది. వైసీపీ 175 సీట్లు గెలుచుకొంటుందని, 5 ఏళ్ళ పదవీకాలం పూర్తయిన తర్వాత ఎన్నికలకు వెళుతుందని సజ్జల చెప్పారు. కానీ రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిస్థితులను చూసి జగన్మోహన్ రెడ్డి హడావుడిగా ఢిల్లీ వెళ్ళి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాలను కలిసి ముందస్తు ఎన్నికలకు అనుమతి కోరారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి కదా?

ADVERTISEMENT
Latest Stories