వైసిపి రాజకీయం కోసం బిసి అభ్యర్థి బలయ్యారా?

YS_Jagan_Kola_Guruvuluయంయల్ఏ కోటాకు జరిగిన యంయల్సీ పోరులో తెలుగుదేశం అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించారు. మామూలుగా అయితే ఇది పెద్ద విశేషం కాదు, 2019లో గెలిచిన యంయల్ఏలను బట్టి వైకాపాకు 6 సీట్లు, తెదేపాకా 1 సీటుకు కావల్సిన బలం ఉంది, కానీ ఎప్పుడైతే వైకాపా ఫిరాయింపులను ప్రోత్సహించి తన బలాన్ని మించి ఏడొవ అభ్యర్థిని నిలబెట్టిందో అప్పుడే అసలు ఆట మెుదలైంది. ఫిరాయింపులతో టిడిపి బలం తగ్గించాం, ఇక 7 సీట్లు మనవే అనే ధీమాతో ఉన్న వైసిపి తెలుగుదేశం తన అభ్యర్థిని నిలబెట్టడంతో కొద్దిగా డిఫెన్స్ లో పడింది.

తెలుగుదేశం తమ అభ్యర్థిని కూడా జాగ్రత్తగా ఎంచుకుంది, ఆర్ధికంగా బలమైన అగ్ర వర్గాల నాయకులున్నా, పార్టీకి విధేయంగా ఉండి, విద్యావంతురాలైన, వివాదరహిత బిసి చేనేత వర్గానికి చెందిన పంచుమర్తి అనురాధ గారిని ఎంపిక చేసుకోవడంతోనే సగం విజయం సాధించింది. మరోపక్క వైసిపి ఇప్పటి వరకూ వేలాది నామినేటెడ్ పదవులు, లాభదాయక పదవులు సొంత కులానికి ఇచ్చి, ఎన్నికల ముందు కంటి తుడుపుగా స్ధానిక సంస్థల, యంయల్ఏ కోటా యంయల్సీ ఎన్నికల్లో కొంత మంది బిసి నాయకులకు టికెట్లు ఇచ్చి బిసిల ఉద్దరణ చేసామనే పేరు సంపాదించుకోవాలనే ఎత్తుగడ వేసింది. వాస్తవానికి తన బలానికి తగ్గట్టుగా 6 మంది బిసిలను ఎంపిక చేస్తే అందరూ గెలిచి ఉండేవారు. లేకపోతే ఏ జిల్లాలో ప్రతిపక్షాలకు బలం లేని స్ధానిక సంస్థల కోటాలో బిసిలను నిలబెట్టి అక్కడ టికెట్ ఇచ్చిన రామసుబ్బారెడ్డి వంటి వారికి ఈ అత్యాశతో నిలబెట్టిన యంయల్ఏల కోటాకు పంపినా కాస్త చెప్పుకోదగ్గట్టుగా ఉండేది. కనీసం ఇక్కడైనా పూర్తి నమ్మకం ఉన్న ఓట్లను బిసి అభ్యర్థులకు కేటాయించి, అనుమానం ఉన్న వారిని అగ్రవర్గాల అభ్యర్థులకు కేటాయించినా బిసి అభ్యర్థులంతా గెలిచేవారు. కానీ అసంతృప్తులను, రెబల్ యంయల్ఏలను కోలా గురువులు వంటి వారికి కేటాయించడం, ఆయన ఓడిపోవడం జరిగింది. ఇది అనుకోకుండా జరిగింది కూడా కాదు, ఫలితాల తరువాత అనేక మంది వైకాపా నాయకులు మాకు వారు వెయ్యరని ముందే తెలుసు అంటూ మీడియాల్లో చెప్పడం వారికి ఎవరెవరు వెయ్యరనే దానిమీద అవగాహన ఉందని అనుకోవాలి. ఇలా తన రాజకీయ లబ్దికోసం ఆడిన ఆటలో కోలా గురువులు వంటి బిసి నాయకుడిని పావుగా వాడింది.

ADVERTISEMENT

ఓటమి తరువాత తన సోషల్ మీడియాల్లో నీతికి కట్టుబడి జగన్ రెడ్డి తెదేపా నుంచి ఫిరాయింపులు ప్రోత్సాహించలేదు, తనతో కాంప్ ఆఫీసులో టచ్ లో ఉన్న మరో నలుగురు యంయల్ఏలను అడిగితే 7వ అభ్యర్ధిని గెలిపించుకోగలిగేవారు అనే ప్రచారం మెుదలు పెట్టింది. అదే నిజమైతే అసలు తమది కాని 7వ సీటుకు అభ్యర్థినే నిలబెట్టే వారు కాదు. నలుగురు యంయల్ఏలను తమ వైపు లాక్కుని ఫిరాయింపులతో అత్యాశకు పోయింది వైసిపి. నిజానికి తేదేపా తమతో 48 మంది వైకాపా యంయల్ఏలు టచ్ లో ఉన్నారని గత కొద్దికాలంగా మీడియాల్లోనే చెబుతున్నారు, అది నిజమైతే మరో ఇద్దరిని నిలబెట్టినా గెలిచేవారు, ఇక్కడ విలువలకు కట్టుబడి తన బలానికి తగిగట్టుగా ఒకే అభ్యర్థిని నిలబెట్టింది టిడిపి. ఇప్పుడే కాదు, 2016లో అప్పటి రాజ్యసభ ఎన్నికల సమయానికే అనేక మంది వైసిపి యంయల్ఏలు టిడిపికి ఫిరాయించారు, మరొక ఐదారు మందిని కూడా తమవైపు తిప్పుకుంటే 2019 వరకు రాజ్యసభలో వైసిపి బోణీ కూడా కొట్టగలిగేది కాదు, విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి వంటి వారు రాజ్యసభకు వెళ్లగలిగే వారు కాదు. 2016లో తనకు గెలిచే అవకాశం కల్పించాలని, తమ యంయల్ఏలను తీసుకోవద్దని విజయసాయి రెడ్డి అప్పటి సభాపతి కోడెల శివప్రసాద్ గారిని అడిగితే ఆయన సహాయం చేసారని ఓసారి ఆర్కే తన వీకెండ్ కామెంట్లలో చెప్పారు. చరిత్రను చూస్తే ముఖ్యమంత్రి జగన్ రెడ్డి తండ్రే 1978 లో ముందు రెడ్డి కాంగ్రెస్ తరపున పోటీ చేసి, ఆ పార్టీ ఓడిపోవడంతో ఫలితాలు వచ్చిన కొద్ది రోజులకే పదవి కోసం కాంగ్రెస్ లోకి ఫిరాయించారు. అదే వైయస్ మెుదటిసారి ముఖ్యమంత్రిగా టిడిపి యంపీలను, తెరాస యంయల్ఏలను ఫిరాయింపచేసారు. ఇక రెండొవ సారి బొటాబొటీ మెజారిటీతో గెలిచి, అధికారం వచ్చిన మెదటి రోజు నుండే ప్రతిపక్షాలకు వల విసిరిన విషయం తెలిసిందే. ఇప్పుడు తనయుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విలువల గురించి ప్రవచనాలు చెప్పి, అధికారంలోకి వచ్చాక తండ్రి బాటలోనే ఫిరాయుంపులు చేసి, ఆ బలంతో తనవి కానీ సీట్లకు పోటీ పెట్టి గెలిస్తే బిసిలకు పట్టం కట్టామనే పేరు కొట్టేయ్యాలనే స్వార్థంతో బిసి అభ్యర్థిని బలిపెట్టారు. ఇప్పటి కైనా బిసిలను నమ్మించాలంటే తన వర్గానికి ఇచ్చిన వేలాది నామినేటెడ్ పదవుల్లో కొన్ని వందలైనా బిసి నాయకులకు ఇచ్చి తమ నిజాయితీ నిరూపించుకోవాలి.

– శ్రీకాంత్

ADVERTISEMENT
Latest Stories