రాజకీయాలలో నడుస్తున్న నయా ట్రెండ్ పుణ్యమాని రాజకీయ పార్టీలు ప్రతి ఒక్క ఎన్నికలను సార్వత్రిక ఎన్నికలుగానే భావిస్తున్నాయి, అలాగే పంచాయితీ సర్పంచ్ నుంచి మున్పిపల్ కార్పొరేటర్ వరకు ఉన్న ప్రతొక్క పదవిని ముఖ్యమంత్రి పీఠం లానే పరిగణిస్తున్నారు.
ఇందుకు తెలంగాణలో మొన్నీమధ్యే పూర్తైన సర్పంచ్ ఎన్నికలు మొదలు ప్రస్తుతం జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల వరకు ఇటు అధికార కాంగ్రెస్ అటు ప్రతిపక్ష బిఆర్ఎస్ చేసిన పోటాపోటీ ప్రచారాలు,
అలాగే ఓటర్లను ప్రలోభపెట్టడానికి పంచిన తాయిలాలు, ఇక పార్టీ క్యాడర్ లో జోష్ నింపడానికి ప్రత్యర్థి పార్టీ నేతల పై పార్టీ పెద్దన్నలు ఎత్తుకున్న బూతు పురాణాలు అన్నీ ఇన్నీ కావనే చెప్పాలి.
ఒక స్థానిక సంస్థల ఎన్నికల కోసమే ఇటు కాంగ్రెస్ అటు బిఆర్ఎస్ తగ్గేదెలా అన్నట్టుగా ఇంత నానా యాగి చెయ్యడం వెనుక ఉన్న అంతిమ లక్ష్యం ఒకరి మీద మరొకరు పై చేయి సాధించాం అనే గర్వం మాత్రమే. అంతే కానీ ప్రజల కోసమో, గ్రామాల అభివృద్ధి కోసమో, నగరాల సుందరణీకరణ కోసమో కానే కాదు.
గతంలో ఒక్క సార్వత్రిక ఎన్నికల సమయంలో మాత్రమే రాజకీయ పార్టీలు ఆయా పార్టీల నేతలు రంగు కాగితాలతోనో, ఉచిత బహుమతులతోనో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసి తమ వైపు ఆకర్షించుకునేవి. కానీ ఇప్పుడా పరిస్థితులు లేవు. అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా ప్రతి ఒక్క ఎన్నికను చాల సీరియస్ గా తీసుకుంటుంది.
ఆ ఎన్నికల గెలుపుని పార్టీ పరువు – ప్రతిష్టతతో ముడిపెడుతుంది. సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపు అవకాశం ఎక్కువగా అధికార పార్టీకే ఉంటుందనే అంశం తెలిసినప్పటికీ ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం ప్రలోభాలకు తగ్గేదెలా అన్నట్టుగా దూసుకుపోతున్నారు.
అలాగే పోలింగ్ స్టేషన్ల వద్ద రిగ్గింగ్ అంటూ హడావుడి, డబ్బులు పంచుతున్నారంటూ హంగామా, దొంగఓట్లు అంటూ రచ్చ , ఇక ఒకరి మీద మరొకరి బెదిరింపులు, దాడులు ఇలా ఎటు వైపు నుంచి చూసిన ఎన్నికలు జరిగే విధానం నుంచి ఎన్నికలు నిర్వహించే పద్దతి వరకు ప్రతి విషయంలోనూ మార్పు అనేది స్పష్టంగా కనిపిస్తుంది.
ఇటువంటి పరిస్థితులలో చిన్న ఎన్నికలకు కూడా రాజకీయ పార్టీలు పెద్ద ప్రయత్నాలు చెయ్యాల్సిన అవసరాలు ఏర్పడుతున్నాయి. ఇందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు, జిల్లా ఇంచార్జ్ ల నుంచి వార్డ్ మెంబర్ల వరకు ప్రతి ఒకరు క్షేత్ర స్థాయిలో ప్రచారానికి రావాల్సి ఉంటుంది, ముందుండి నడిపించాల్సి వస్తుంది.
ఏ రంగంలో అయినా జయాపజయాలు సర్వసాధారణంగా సాగే ప్రక్రియలో భాగమే. కానీ ప్రస్తుతం రాజకీయాలలో నడుస్తున్న ట్రెండ్ చూస్తుంటే పార్టీలు గెలుపు ను ఆస్వాదిస్తున్నాయి కానీ ఓటమిని స్వీకరించలేకపోతున్నాయి. అలాగే రాజకీయ నాయకులు అధికారాన్ని అనుభవించడానికి ఉత్సుకత చూపిస్తున్నారు కానీ ప్రతిపక్షాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
ఈ కారణాలే చిన్న చిన్న ఎన్నికలకు కూడా పాన్ ఇండియా బడ్జెట్లు పెట్టాల్సిన పరిస్థితులు, అలాగే ఆ ఫలితాలకు కూడా పార్టీలు, నేతలు భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత మాదిరి భారీ నుంచి అతిభారీ స్థాయిలో పెరిగిన ఈ ఎన్నికల బడ్జెట్ కూడా ఎదోకరోజు నేలచూపులు చూస్తాయని, చూడాలి ఆశిద్దాం..!






