తెలంగాణలో 17 ఎంపీ స్థానాలకు మే 13న పోలింగ్ జరుగబోతోంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటుకి జరుగుతున్న లోక్సభ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలపై పెద్దగా ప్రభావం చూపవు. కానీ తెలంగాణలో అనూహ్యంగా కాంగ్రెస్ గెలిచి అధికారంలోకి రావడం, కాంగ్రెస్ చేతిలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడంతో ఈ ఎన్నికలు రెండు పార్టీలకు కీలకంగా మారాయి.
తెలంగాణ ప్రజలు పదేళ్ళపాటు కేసీఆర్ ప్రభుత్వం ఏవిదంగా పనిచేస్తుందో చూశారు. కనుక దాంతో రేవంత్ రెడ్డి పాలనను బేరీజు వేసుకొని చూస్తారు. అన్నం ఉడికిందో లేదో తెలుసుకోవడానికి పైమెతుకుముట్టుకుంటే తెలిసిపోయిన్నట్లే, రేవంత్ పాలన ఏవిదంగా ఉందో అర్దం చేసుకోవడానికి ఈ నాలుగు నెలల పాలన చాలు. రేవంత్ రెడ్డి కూడా ఈ ఎన్నికలు తన పాలనకు రిఫరెండం అని చెప్పుకొంటున్నారు.
కనుక ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కనీసం 10-12 ఎంపీ సీట్లు గెలుచుకొని, మరోసారి ప్రజామోదం పొందామని చెప్పుకోవాలని ఆశపడుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీ 7-8 సీట్లు, బీజేపీ 5-6 సీట్లు, బిఆర్ఎస్ 2-3 సీట్లు, మజ్లీస్ ఒక్క సీటు గెలుచుకొనే అవకాశం ఉందని సర్వేలు చెపుతున్నాయి.
కనుక కాంగ్రెస్ పార్టీ 7-8 సీట్లు గెలుచుకున్నా రేవంత్ రెడ్డి ఈ అగ్నిపరీక్షలో నెగ్గిన్నట్లే భావించవచ్చు. ఒక ఎంపీ సీటుని గెలుచుకోవడం అంటే దాని పరిదిలో గల శాసనసభ నియోజకవర్గాలలో ఆ పార్టీకి బలం పెరిగిన్నట్లే.. పట్టు సాధించిన్నట్లే లెక్క. కనుక కాంగ్రెస్ పార్టీకి ఉన్న మూడు ఎంపీ సీట్లకు అదనంగా మరో మూడు సీట్లు గెలుచుకున్నా సరిపోతుంది.
ఇక ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ 2-3 సీట్లకు పడిపోతే కేసీఆర్ నాయకత్వంపై పార్టీ శ్రేణులకు నమ్మకం పోతుంది. అప్పుడు పార్టీ పూర్తిగా ఖాళీ అయిపోయే ప్రమాదం ఉంది. కనుక ఈ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఎట్టి పరిస్థితులలో కనీసం 7-8 సీట్లు గెలుచుకుంటేనే కేసీఆర్ మళ్ళీ ప్రగల్భాలు పలుకగలుగుతారు లేకుంటే (ఒకవేళ బిఆర్ఎస్ పార్టీలో ఇంకా ఎవరైనా మిగిలి ఉంటే) నాయకత్వం మార్పు అనివార్యమే. కనుక ఈ ఎన్నికలు రేవంత్ రెడ్డి కంటే కేసీఆర్కే అగ్నిపరీక్ష అని భావించవచ్చు.
ఈ ఎన్నికలలో బీజేపీ కూడా 5-6 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని సర్వేలు చెపుతుండటం దానికి చాలా మంచి వార్తే. కానీ ఈసారి కూడా కేంద్రంలో మళ్ళీ బీజేపీయే అధికారంలోకి రాబోతోందని సర్వేలు సూచిస్తున్నందున తెలంగాణలో దాని గెలుపోటములు ఆ పార్టీపై పెద్దగా ప్రభావం చూపవు.




