సమైక్య రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 9 ఏళ్ళ అజ్ఞాతవాసం తర్వాత మళ్ళీ బిజెపి కండువా కప్పుకొని ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చారు. అయితే తాను పదవులు, అధికారం కోసమో ఆశపడి రాలేదని కేవలం రాష్ట్రాన్ని ఉద్దరించడానికే వచ్చాన్నన్నారు. ఇది ప్రతీ రాజకీయ నాయకుడు చెప్పే మాటే కదా? టికెట్లు, పదవులు, అధికారం, కాంట్రాక్టులు, కమీషన్లు కోరుకొని రాజకీయ నాయకుడు ఎవరున్నారు ఈ దేశంలో? టికెట్లు, పదవుల కోసమే కదా… అందరూ పార్టీలు మారేది? కానీ తాను అటువంటి కోరికలులేవీ లేని కాషాయ కండువా కప్పుకొచ్చిన సాధువునని కిరణ్ కుమార్ రెడ్డి చెప్పుకొన్నారు. అంటే ఆయన ప్రజలు వెర్రివాళ్ళనుకొంటున్నారన్న మాట!
ఆయన కూడా అందరూ నేతల్లాగే బిజెపి అధిష్టానంతో ముందుగా పదవి గురించి బేరం ఆడుకొనే కాషాయకండువ కప్పుకొన్నారనే విషయం నేడో రేపో పదవి వస్తే ఎలాగూ తెలుస్తుంది. అది అప్రస్తుతం. కానీ ఇకపై ఆయన ఏపీ రాజకీయాలలో ఏవిదంగా చక్రం తిప్పుతారనేదే ముఖ్యం.
పవన్ కళ్యాణ్ అవసరం లేదని జనసేన-బిజెపిల బంధం కట్ చేసేస్తారా? ఏపీలో ఇప్పటికిప్పుడు బిజెపి ఎలాగూ బలపడి అధికారంలోకి రాలేదు కనుక పవన్ కళ్యాణ్ టిడిపివైపు మొగ్గు చూపకుండా చక్రం తిప్పుతూ వైసీపీకి తోడ్పడతారా?అనేది రాబోయే రోజుల్లో మెల్లగా తెలుస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి వలన ఏపీకి ఏమాత్రం మేలు జరిగినా సంతోషమే కానీ ఆయన మరోమారు రాజకీయ చదరంగం ఆడాలనుకొంటే రాష్ట్రానికి తీరని నష్టం చేసినవారవుతారని గ్రహిస్తే మంచిది.



