శాసనసభ సమావేశాలలో ముఖ్యమంత్రి, మంత్రులు రాష్ట్ర ఆదాయం గణనీయంగా పెరిగిందనో లేదా పడిపోయిందనో చెప్పి దానికి కారణాలు వివరించగలరు. అలాగే పరిశ్రమలు, పెట్టుబడులు, రాష్ట్రాభివృద్ధి, సంక్షేమ పధకాలు దేని గురింఛి అయినా ధైర్యంగా మాట్లాడగలరు. అలాగే రాష్ట్ర జనాభా తగ్గిపోతోంది కనుక ఎక్కువ మంది పిల్లలను కనమని కూడా విజ్ఞప్తి చేస్తుంటారు.
కానీ రాష్ట్రంలో అక్షరాస్యత శాతం దారుణంగా పడిపోయిందని శాసనసభలో చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే శాసనసభలో ఇలా చెప్పుకుంటే ప్రభుత్వానికి తీరని అప్రదిష్టే కదా?
కానీ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు శాసనసభలో మాట్లాడుతూ, “ఆంధ్రప్రదేశ్లో అక్షరాస్యత చాలా దారుణంగా పడిపోయింది. ఎంతగా అంటే బిహార్ కంటే దిగువకు పడిపోయింది. వైసీపీ ప్రభుత్వ హయంలో పాఠశాల విద్యపై చేసిన పిచ్చి పిచ్చి ప్రయోగాలతో అనేకమంది విద్యార్ధులు మద్యలో చదువుకు దూరం అయ్యారు.
ఓ పక్క పిల్లలలో చదువులకు దూరమై వారిలో నిరక్షరాస్యత పెరిగిపోతుంటే, పెద్దవారిలో అక్షరాస్యత పెంచేందుకు గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టలేదు. అందువల్ల దేశంలో నిరక్షరాస్యులు ఎక్కువ శాతం ఉన్న రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ నిలిచింది.
ఇటీవల నేను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ని కలిసినప్పుడు ఆయన ఈ విషయం గురించి అడిగారు. దీనిని దాచి పుచ్చాల్సిన అవసరం లేదని, రాబోయే మూడేళ్ళలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని టాప్: 5కి తీసుకువచ్చే బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇచ్చాను,” అని మంత్రి నారా లోకేష్ చెప్పారు.
గత ప్రభుత్వ హయంలో ప్రభుత్వ పాఠశాలలపై బలవంతంగా ఇంగ్లీష్ మీడియం రుద్దడం, బైజూతో ఆన్లైన్ పాఠాల ప్రయోగాలు, విద్యార్ధులకు ట్యాబ్స్ ఇవ్వడం, పాఠశాలల విలీనం, ఉపాధ్యాయులకు అన్ని రకాల పనులు అప్పగించడం, నెలనెలా జీతాలు చెల్లించకపోవడం… ఒకటా రెండా అనేకానేక సమస్యలు సృష్టించారు.
ప్రభుత్వ పాఠశాలలంటే అనేక సమస్యలకు నిలయాలు. అలాంటి వాటిలో జగన్ ప్రభుత్వం కొత్తగా మరిన్ని సమస్యలు సృష్టించి, పాఠశాలలలో కూడా వైసీపీ మార్క్ రాజకీయాలు చేస్తే పిల్లలు చదువులకు దూరం అవకుండా ఉంటారా? జగన్ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలతో పాటు విద్యా వ్యవస్థని కూడా 5 ఏళ్ళపాటు భ్రష్టు పట్టించేయడం వల్లనే అక్షరాస్యతలో ఆంధ్రప్రదేశ్ బిహార్ కంటే వెనకబడిందిని మంత్రి నారా లోకేష్ చెప్తున్నా మాట నూటికి నూరు శాతం నిజమే!




