టిడిపి యువనాయకుడు నారా లోకేష్ యువగళం పాదయాత్రలో వైసీపీ ప్రభుత్వానికి ముచ్చెమటలు పట్టిస్తున్నారు. గురువారం సత్యవేడు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నప్పుడు డిక్సన్ కంపెనీ ఉద్యోగులని తీసుకొని వెళుతున్న బస్సు కనబడింది. నారా లోకేష్ ఆ బస్సులో ఎక్కి దానిలో ప్రయాణిస్తున్న డిక్సన్ మహిళా ఉద్యోగులని ఆప్యాయంగా పలకరించారు. వారి సమస్యలని అడిగి తెలుసుకొన్నారు. ఆ తర్వాత ఆ బస్సు ఎదుట నిలబడి ఓ సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
“నేను మంత్రిగా ఉన్నప్పుడు ఈ డిక్సన్ కంపెనీని రాష్ట్రానికి తీసుకువచ్చాను. ఇదిగో దానిలో పనిచేస్తున్న ఉద్యోగులు. ఆ డిక్సన్ కంపెనీ బస్సు ముందు నిల్చుని సెల్ఫీ దిగాను. నువ్వూ ఇలా ఒక సెల్ఫీ దిగగలవా?” అంటూ సిఎం జగన్మోహన్ రెడ్డికి నారా లోకేష్ సవాలు విసిరారు.
ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రాష్ట్రానికి వేలు, లక్షల కోట్లు పెట్టుబడులతో పరిశ్రమలు వచ్చిపడిపోతున్నాయని, వాటితో లక్షలమంది నిరుద్యోగులకి ఉద్యోగాలు దొరికేస్తున్నాయని గొప్పలు చెప్పుకొంటారు.
అయితే వాస్తవ పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసు. కొన్ని పరిశ్రమలు, ఐటి కంపెనీలు పొరుగు రాష్ట్రాలకి తరలిపోతుంటే, మరికొన్నిటికి మళ్ళీ మళ్ళీ శంకుస్థాపనలకే పరిమితమవుతున్నాయి. వేసవి వస్తే ఏపీలో పరిశ్రమలకి విద్యుత్ కోతలు మొదలైపోతాయి. అయినా రాష్ట్ర రాజధాని ఎక్కడో, ఎప్పుడో తెలియకుండా పెట్టుబడులు పెట్టేందుకు ఎవరు ముందుకు వస్తారు?
సెల్ఫీల విషయానికి వస్తే తెలంగాణ ఐటి పరిశ్రమల మంత్రి కేటీఆర్తో సెల్ఫీలు దిగేందుకు పారిశ్రామికవేత్తలు క్యూ కడుతుంటారు. చివరికి మన ఏపీ ఐటి పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి కూడా మొన్న హైదరాబాద్ వెళ్ళి కేటీఆర్తో సెల్ఫీలు దిగి, ఆ ఫోటోలని సోషల్ మీడియాలో గర్వంగా పోస్ట్ చేసుకొన్నారు.
కనుక కోడీ..గుడ్డు… అంటూ కధలు చెప్పే గుడివాడతో, మూడు రాజధానులనే సిఎం జగన్మోహన్ రెడ్డితో ఏ పారిశ్రామికవేత్త సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపుతారు?ఏ పరిశ్రమని తెచ్చామని చెప్పుకోగలరు మీరు? అని నారా లోకేష్ ప్రశ్నిస్తున్నారు.



