నిర్మాణాల విలువ తెలిసినోడికే కూల్చివేతల భారం అర్ధవవుతుందేమో. నాడు 2019 ఎన్నికలలో మంగళగిరి నియోజకవర్గంలో బాబు తనయుడు లోకేష్ ని ఓడించి వైసీపీ ఎమ్మెల్యే గా ప్రజల మద్దతు పొందిన ఆళ్ల రామకృష్ణ రెడ్డి అక్కడి ప్రాంత ప్రజలకు ఎన్నో హామీలిచ్చారు.
అందులో ఒకటి మంగళగిరి ప్రాంతంలో దశాబ్దాలుగా పట్టాలు లేకుండా ఉన్న ఇళ్లకు ప్రభుత్వం తరుపున పట్టాలు ఇప్పిస్తాం, తాడేపల్లి వరద బాధితుల కోసం వరద ముంపుని తట్టుకునేలా ఆ ప్రాంతంలో ఒక గోడ నిర్మిస్తాం, ఇళ్ళు లేని పేదలకు ఇళ్ల స్థలాలు అందిస్తాం అంటూ ఇలా ఎన్నో ఎన్నికల హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు.
అయితే ఆ హామీలన్నీ కూడా కేవలం ఎన్నికల ప్రచారం వరకే అన్నట్టుగా వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆళ్ళ వ్యవహారం నడిచింది. పేదలకు ఉచిత ఇల్లు అంటూ ప్రకటించి అటు పిదప అధికారంలోకి రాగానే సీఎం జగన్ కు భద్రతా సమస్యలు అంటూ అదే పేదల ఇళ్లను నిర్దాక్షిణ్యంగా కూల్చేశారు.
ఎందుకు అని అడిగిన గొంతులకు బెదిరింపులు, ఇదెక్కడి ఘోరం అంటూ నిలదీసిన వారి పై అధికార జులుం ఇవన్నీ కూడా గత వైసీపీ ప్రభుత్వంలో తాడేపల్లి వాసులు అనుభవించిన కష్టాలు. కానీ 2024 ఎన్నికలలో మంగళగిరి వాస్తవ్యులు ఆళ్ళ అరాచకాన్ని, వైసీపీ నిరంకుశత్వాన్ని కాళ్ళ కింద వేసి తొక్కినట్టు తొక్కి లోకేష్ ని 90 వేల ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలిపించారు.
అయితే లోకేష్ రాకతో మంగళగిరి టీడీపీ కంచుకోటగా మారుతుంది. నిత్యం ఏదొక కార్యక్రమంతో ప్రజలకు దగ్గర గా ఉంటూ స్థానిక సమస్యల పరిష్కారం కోసం చొరవ చూపిస్తూ, ఎన్నికల సందర్భంగా స్థానిక ప్రజలకిచ్చిన ఒక్కో హామీని నెరవేరుస్తూ మంగళగిరి లోకేష్ అడ్డా అనేలా పని చేస్తున్నారు.
గతంలో ఇదే ప్రాంతానికి చెందిన అనేకమంది పేదల ఇళ్లకు ప్రభుత్వం తరుపున అధికార పట్టాలు అందించి వారి దశాబ్దాల కలను పూర్తి చేసారు. ఇక నేడు తాడేపల్లి రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు. దీని ద్వారా వరద శాతం పెరిగితే తాడేపల్లిలో ముంపుకు గురవుతున్న సుందరయ్య నగర్, మహానాడు కాలనీలకు రక్షణ ఏర్పడుతుంది.
ఈ గోడ నిర్మాణం కూడా ఇక్కడి ప్రాంత ప్రజల చిరకాల వాంఛ. అయితే లోకేష్ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల లోపే మంగళగిరి నియోజకవర్గ ప్రజలకిచ్చిన ఒక్కో ఎన్నికల హామీని ఇలా నెరవేర్చుకుంటూ రావడంతో నాడు కూల్చివేతల పర్వం నడిస్తే నేడు నిర్మాణాల శకం మొదలయ్యింది అంటు స్థానిక ప్రజలు లోకేష్ కి అభినందనలు తెలియచేస్తున్నారు.
రిటైనింగ్ వాల్ శంకుస్థాపన కార్యక్రమంతో పాటుగా నేడు లోకేష్ తన నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. అందులో 65 లక్షల వ్యవయంతో శ్రీరంగం ఫౌండేషన్ సహకారంతో నులకపేటలో నిర్మించిన కమ్యూనిటీ హల్ ను ప్రారంభించారు. అలాగే పెదవడ్లపూడిలో 14.88 కోట్ల వ్యయంతో నిర్మించిన హైలెవల్ కెనాల్ ఎత్తిపోతల పథకాన్ని ప్రారభించారు.




