నందమూరి తారకరత్న చనిపోవడంతో చివరిచూపు కోసం హైదరాబాద్ వచ్చిన టిడిపి యువనాయకుడు నారా లోకేష్, మళ్ళీ నేటి నుంచి యువగళం పాదయాత్రని ప్రారంభించారు. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తొండమానుపురం పంచాయతీ వద్ద నారా లోకేష్ 300 కిమీ మైలురాయి దాటారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ గ్రామ ప్రజలతో మాట్లాడినప్పుడు చుట్టుపక్కల 13 గ్రామాలకి త్రాగునీరు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని చెప్పారు. తొండమానుపురం పంచాయతీ తా 300కిమీ పాదయాత్రకి తీపిగుర్తుగా నిలిచినందున తమ పార్టీ అధికారంలోకి రాగానే ఈ పంచాయతీ పరిధిలోని 13 గ్రామాలకి రక్షితమంచినీటి పధకం ఏర్పాటుచేసి శాస్వితంగా త్రాగునీటి సమస్య లేకుండా చేస్తానని నారా లోకేష్ హామీ ఇచ్చారు. అలాగే రైతులకి గిట్టుబాటు ధరలు కల్పించేందుకు రూ.3,500 కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.
దారిలో పొలానికి పురుగుల మందు చల్లెందుకు వెళుతున్న వ్యవసాయకూలీలతో కాసేపు ముచ్చటించారు. ఈ పురుగుల మందు కంటే జగన్ ప్రభుత్వం అమ్ముతున్న కల్తీ మద్యాన్ని పిచ్చికారి చేస్తే పంటలని ఆశించిన పురుగులన్నీ చనిపోతాయని అన్నారు. వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకొన్నారు. దారిలో బడికి వెళుతున్న చిన్నారులు కనపడగా నారా లోకేష్ ఆగి వారిని ఆప్యాయంగా పలకరించి, గురువులని గౌరవిస్తూ తల్లితండ్రులు మెచ్చుకొనేలా బాగా చదువుకోవాలని చెప్పారు. తర్వాత పిల్లలకి బైబై చెప్పి ముందుకు కదిలారు.
యువగళం పాదయాత్రకి పోలీసులు ఎన్ని అవరోధాలు సృష్టిస్తున్నా నారా లోకేష్ నిబ్బరంగా వాటన్నిటినీ అదిగమిస్తూ ముందుకు సాగిపోతున్నారు. ఓ పక్క ప్రజల సమస్యలు అడిగి తెలుసుకొంటూ వారి భవిష్యత్కి భరోసా కల్పిస్తూ, మరోపక్క సిఎం జగన్మోహన్ రెడ్డి తీరుని ఎండగడుతూ ముందుకు సాగిపోతున్నారు. పాఠశాల విద్యార్దులు ఓటర్లు కారు. వారిని పలకరించకపోయినా వచ్చే నష్టం లేదు. ఎవరూ అభ్యంతరం చెప్పరు కూడా. కానీ నారా లోకేష్ వారితో ఆప్యాయంగా మాట్లాడటం తల్లితండ్రులని గౌరవించాలని చెప్పడం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతోంది.



