తెలుగు రాష్ట్ర రాజకీయాలలో కొత్త ట్రెండ్స్.?

Telugu States Political Trends

అవును, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలలో రెండు కొత్త ట్రెండ్స్ నడుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే ఇక్కడి రాజకీయాలు ఎక్కువగా కులాధారితంగా సాగుతూ ఉంటాయి. మరీ ముఖ్యంగా కమ్మ – కాపు – రెడ్డి ఈ మూడు సామాజికవర్గాల కేంద్రంగా ఏపీ రాజకీయాలు ఎప్పటికప్పుడు తన దిశను మార్చుకుంటూ ముందుకెళ్తుంటాయి.

కానీ తాజాగా ఏపీ రాజకీయాలను పరిశీలిస్తే ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు ఇక్కడ మత రాజకీయాలు ప్రారంభమయ్యాయి. తిరుమల శ్రీవారి ప్రసాదంలో కల్తీ నెయ్యి వివాదం తెర మీదకు వచ్చిన నాటి నుంచి కూడా వైసీపీ – కూటమి పార్టీల మధ్య సాగుతున్న రాజకీయం చిలికి చిలికి మత రాజకీయాల సృష్టికి భీజం వేసాయి.

ADVERTISEMENT

దీనితో ఇప్పుడు తిరుమల శ్రీవారి పట్ల తాము అపచారం చెయ్యలేదని, తనకు, తన పార్టీకి హిందూ మతం పై భక్తి, గౌరవం ఉన్నాయని నిరూపించుకోవడానికి వైసీపీ అధినేత వైస్ జగన్ శివ పూజలతో శీల పరీక్షకు సిద్ధపడ్డారు. అలాగే వైసీపీ నేతలు కూడా తాము కూడా హిందువులమే అని ప్రచారం చేసుకోవడానికి ఫొటోలతో మీడియాలో దర్శనమిచ్చారు.

ఇలా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఇప్పుడు కుల రాజకీయాలతో పాటు మత రాజకీయాలను కూడా తనలో ఇముడ్చుకుని నయా ట్రెండ్ ని సృష్టిస్తుంది. ఇక మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ విషయానికొస్తే, ఇక్కడ ఎక్కువగా రాజకీయ పార్టీలు, ప్రజలు కూడా ప్రాంతీయవాద రాజకీయానికి లోబడి ఉంటారు.

మా తెలంగాణ, జై తెలంగాణ అనే నినాదాలు ఇక్కడి రాజకీయ పార్టీలకు ఒక భగవత్ గీత, ఒక ఖురాన్, ఒక బైబుల్ వంటివనే చెప్పాలి. అలాంటి తెలంగాణలో ఇప్పుడు కుల రాజకీయాలు పురుడు పోసుకుంటున్నాయి. బీసీ రిజర్వేషన్ల అంశంతో తెలంగాణలో కుల రాజకీయాలు రాచుకున్నాయి.

అయితే ఈ కుల రాజకీయాల అగ్గి రాజేసిన తీన్మార్ మల్లన మొన్న జరిగిన స్థానిక ఎన్నికలలో కనీసం డిపాజిట్లు కూడా పొందలేకపోయారు. ఇక అగ్గి తో కాంగ్రెస్ పార్టీ పరిధిని విస్తరించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ సైతం బీసీ సామాజికవర్గాల టార్గెట్ గా రాజకీయ హామీలు అందిస్తున్నారు.

అలాగే బిఆర్ఎస్ తో తెగతెంపులు చేసుకుని జాగృతితో సొంత కుంపటి పెట్టుకున్న కవిత సైతం తన కొత్త పార్టీకి కుల రాజకీయాలే ప్రధాన ఆయుధంగా మలచుకోనుంది. అందులో భాగంగానే బీసీ రిజర్వేషన్ల అంశానికి తన మొదటి ప్రాధాన్యత అంటూ ప్రతిపక్ష బిఆర్ఎస్ పై వేలెత్తి చూపుతూ అధికార పార్టీతో పోరాటానికి సిద్దమయ్యారు.

ఇక ఇన్నాళ్లు ప్రాంతీయవాదం అనే రాజకీయ కవచం కింద రక్షణ పొందిన బిఆర్ఎస్ కూడా నేను సైతం అంటూ కుల రాజకీయాలకు జై కొట్టాల్సి వచ్చింది. ఇలా ఏపీ కుల రాజకీయాల నుండి మత రాజకీయాలకు, తెలంగాణ ప్రాంతీయవాద రాజకీయం నుంచి కుల రాజకీయాలకు మారి రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాలు కూడా ఈ రెండు కొత్త ట్రెండ్స్ ని ఫాలో అవుతున్నాయి. మరి వీటిలో ప్రజల మనసు గెలిచే రాజకీయ పార్టీ ఎదో.?

ADVERTISEMENT
Latest Stories