ఆంధ్రప్రదేశ్లో తమ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పధకాలతో వచ్చే ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 151 శాసనసభ స్థానాలలో భారీ మెజార్టీతో గెలువబోతోందని ఆ పార్టీ అధినేత, సిఎం జగన్మోహన్ రెడ్డి జోస్యం చెపుతున్నారు. కనుక ఇక తమకు ఎన్నికల వ్యూహ నిపుణుడు ప్రశాంత్ కిషోర్ అవసరం లేదని, ఆయన సేవలు ఉపయోగించుకోబోవడం లేదని నెల రోజుల క్రితమే ప్రభుత్వం మీడియా సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్మీట్ పెట్టి మరీ ప్రకటించారు.
కానీ తాజా సమాచారం ప్రశాంత్ కిషోర్ ఏర్పాటు చేసుకొన్న ఇండియన్ పోలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) బృందం ఉత్తరాంద్ర జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం సర్వేలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. ముందుగా ఐ-ప్యాక్ బృందం ఫోన్ ద్వారా వివిద నియోజకవర్గాలలో ప్రజలను సంప్రదిస్తూ, ఎమ్మెల్యేల పనితీరు, సంక్షేమ పధకాలు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తదితర అంశాలపై అభిప్రాయాలూ తెలుసుకొంటున్నట్లు సమాచారం. త్వరలో ప్రత్యక్ష సర్వేలు కూడా చేసిన తరువాత మిగిలిన జిల్లాలలో కూడా ఇదేవిదంగా మొదట ఫోన్ సర్వేలు తరువాత ప్రత్యక్ష సర్వేలు చేయబోతున్నట్లు సమాచారం.
వీలైనంత త్వరగా ఈ సర్వేలు పూర్తి చేసి నివేదికలు సమర్పించాలని ఐ-ప్యాక్ బృందాన్ని వైసీపీ కోరినట్లు తెలుస్తోంది. అయితే ఉత్తరాంధ్రలో సర్వే చేస్తున్నట్లు వస్తున్న ఈ వార్తలను దృవీకరించడానికి ఐ-ప్యాక్ బృందం నిరాకరించినట్లు సమాచారం. ఒకవేళ ఐ-ప్యాక్ బృందం ఉత్తరాంధ్రలో సర్వే చేస్తుండటం నిజమే అయితే వచ్చే ఎన్నికలలో సంక్షేమ పధకాలు తమను గట్టెకించలేవని వైసీపీ ప్రభుత్వం గ్రహించినట్లే భావించవచ్చు. కనుక దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్నట్లు ఇప్పటి నుంచే తమ పార్టీ, ప్రభుత్వం వాస్తవ పరిస్థితి, లోటుపాట్లను సర్వేలతో తెలుసుకొని వీలైనంతవరకు సరిదిద్దుకొని ముందుకు వెళ్ళడం మంచిదని వైసీపీ భావిస్తోందనుకోవచ్చు.



