ఏపీ బడ్జెట్ సమావేశాలలో సిఎం జగన్మోహన్ రెడ్డి తన ప్రభుత్వం గొప్పల గురించి చెప్పుకొంటుంటే, టిడిపి సభ్యులపై సస్పెన్షన్ వేటు పడటంతో ఎవరికీ వినే భాగ్యం లభించలేదు. అందుకే మీడియాలో నుంచి సిఎం జగన్ శాసనసభలో ఉపన్యాసాల వీడియోలను డౌన్లోడ్ చేసుకొని మరీ విని ఆనందిస్తున్నారు. బహుశః రాష్ట్రంలోని వైసీపీ నేతలు కూడా ఇంత శ్రద్దగా విని ఉండరేమో?
శాసనసభలో ఉన్న కొద్దిసేపులోనే వైసీపీ మంత్రులకు తన ప్రశ్నలు, విమర్శలతో చెమటలు పట్టించిన టిడిపి శాసనసభ్యుడు పయ్యావుల కేశవ్, సిఎం జగన్ వీడియో క్లిప్పింగులు తెచ్చుకొని విని, వాటిపై తనదైన శైలిలో అభిప్రాయాలను వీడియో రూపంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
“మన రాష్ట్రం జీడీపీ గ్రోత్ రేట్ 11.23%కి పెరిగింది. ఆ స్థాయిలో మన గ్రోత్ రేట్ ఏవిదంగా పెరిగింది?దానికి కారణం ఏమిటని ఆలోచిస్తే, ఇది ఆర్ధిక వేత్తలకు కూడా మంచి సబ్జెక్ట్ (పాఠంగా) పనికి వస్తుంది,” అని సిఎం జగన్ గొప్పగా చెప్పుకొన్నారు.
దీనిపై పయ్యావుల స్పందిస్తూ, “అవును మీవి శ్రీలంక ఎకానమిక్స్, పాకిస్తాన్ పాలిటిక్స్. శ్రీలంక పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలుసు. అలాగే పాకిస్తాన్ పాలిటి క్స్లో రోజూ ఎవరో ఒకరిని తీసుకువెళ్లి లోపల వేస్తుంటారు. మీ ప్రభుత్వం కూడా ఇక్కడ అదే చేస్తోంది కదా? ప్రపంచంలో కెల్లా అత్యుత్తమైన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వాళ్ళే ఎప్పుడెప్పుడు ఆంధ్రప్రదేశ్కి వద్దామా… ఎప్పుడెప్పుడు మీ ఈ ఎకనామిక్స్ చూద్దామా… అవి ఈ ప్రపంచ దేశాలకి ఏవిదంగా ఉపయోగపడతాయో తెలుసుకోవాలని తహతహలాడుతున్నారు. నిజానికి మీరు గొప్ప క్యాపిటలిస్ట్ కానీ పొరపాటున ఎకనమిస్ట్ అని చెప్పుకొంటున్నారు. ఇందుకు మీ సాక్షి పేపరే సాక్ష్యం. గత 9 ఏళ్లుగా నష్టాలలో కూరుకుపోయిన సాక్షి పేపర్, ఈ మూడున్నరేళ్ళలోనే రూ.162 కోట్లు లాభాలలోకి వచ్చేసింది. అదే మీ గొప్పతనం,” అని పయ్యావుల ఎద్దేవా చేశారు.
“అధ్యక్షా… నా నడక మాత్రం నేలమీదే…” అని సభలో సిఎం జగన్ చెప్పిన మాటలపై స్పందిస్తూ, “నేను ముఖ్యమంత్రిగారిని నేలపై నడవొద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఒక్కసారి నడిస్తేనే రాష్ట్రం ఎక్కడికో వెళ్లిపోయింది. ప్రజల జీవితాలు మరింక ఎక్కడికో వెళ్లిపోయాయి. కనుక మళ్ళీ మీరు అటువంటి ఆలోచనలు చేయకండి. మీరు నేలపై నడిస్తే ప్రజలు మళ్ళీ పరదాల వెనక్కి వెళ్లిపోవలసి ఉంతుంది కనుక చాలా ఇబ్బంది పడతారు. కనుక మీరు హాయిగా స్పెషల్ ఫ్లైట్స్, హెలికాఫ్టర్లలోనే తిరగండి. మీ ఈ విమానాలు, హెలికాఫ్టర్ల ఖర్చులు, మీ ప్రకటనల ఖర్చులు భరించడం కాస్త కష్టమే అయినా ఏదోవిదంగా భరిస్తాము,” అని పయ్యావుల ఎద్దేవా చేశారు.
శాసనసభలో “నా బీసీ, నా మైనార్టీ వర్గాలకి…” అని సిఎం జగన్ అనడంపై స్పందిస్తూ, “అయ్యా ముఖ్యమంత్రిగారు… మహానుభావుడు నందమూరి తారకరామారావు టిడిపి స్థాపించి బీసీలకు రాజ్యాధికారం కల్పించారు. రాష్ట్రంలో బడుగు బలహీనవర్గాల ప్రజలందరికీ రాజ్యాధికారం కోసం టిడిపిని ఓ వేదికగా అందించారు. అప్పటి నుంచే అన్ని పార్టీలు బీసీలను గుర్తించి ఆదరించడం మొదలుపెట్టాయి. కనుక బీసీలు టిడిపిని ఓన్ చేసుకొని మా పార్టీతో చాలా కంఫర్టబుల్గా ఉన్నారు. సుఖంగా బ్రతుకున్న బీసీలని మీరు నా బీసీలు… నా బీసీలు… అంటుంటే వాళ్ళు చాలా భయపడుతున్నారు. ఎందుకంటే మీకు నా అనుకొనేవాళ్ళు ఎవరూ అచ్చిరాలేదు. అలాగే మీతో ఉన్నవారెవరికీ కూడా మీరు అచ్చిరాలేదు. కనుక మీరు బీసీలని నా బీసీలు అంటే వాళ్ళు భయపడుతున్నారు. కనుక వాళ్ళని తెలుగుదేశంతో పాటు హాయిగా సుఖంగా, సంతోషంగా ఉండనీయండి,” అంటూ పయ్యావుల ఎద్దేవా చేశారు.
జగన్ రెడ్డిది శ్రీలంక ఎకనామిక్స్, పాకిస్తాన్ పాలిటిక్స్, ఆ విషయం దేశం మొత్తం తెలుసు. జగన్ రెడ్డి ఒక్కసారి నేల మీద నడిచినందుకే రాష్ట్రం ఎక్కడికో వెళ్ళిపోయింది. మళ్లీ మీరు ఆ ప్రయత్నం చేయొద్దు. మీరు నా బీసీలు అంటే బీసీలు భయపడుతున్నారు.(1/2) pic.twitter.com/yWJjQ7cXC7
— Telugu Desam Party (@JaiTDP) March 17, 2023



