వాలంటీర్లకి పించన్… ఎంత దూరదృష్టో!

Village_Volunteersవైసీపీ ప్రభుత్వం మరో వివాదాస్పద నిర్ణయం తీసుకొంది. అమరావతిలో భూమి లేని 200 మంది వాలంటీర్ల కుటుంబాలకి పింఛన్ మంజూరు చేస్తున్నట్లు ఏపీ పురపాలకశాఖ ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి గురువారం ప్రకటించారు. భూమిలేని నిరుపేద వాలంటీర్లు తమ సమస్యలని సిఎం జగన్మోహన్ రెడ్డికి చెప్పుకోగా ఆయన సానుకూలంగా స్పందించి పింఛన్ మంజూరు చేయాలని ఆదేశించారని తెలిపారు. మార్చి 1వ తేదీ నుంచే వారికి ఈ పించన్ అందజేస్తామని వై.శ్రీలక్ష్మి తెలిపారు.

వాలంటీర్లకి నెలకి రూ.5000 జీతం చెల్లిస్తూ, మళ్ళీ వారు భూమిలేని పేదలనే పేరుతో వారి కుటుంబాలకి నెలనెలా పించన్ చెల్లించడం వివాదాస్పద నిర్ణయమే అని చెప్పవచ్చు. ఒకవేళ భూమిలేని పేదలకి రాష్ట్ర ప్రభుత్వం పించన్ అందించాలనుకొంటే రాష్ట్రంలో కోట్లమంది పేదలున్నారు. వారందరికీ కూడా పించన్ చెల్లించాలి కదా?కానీ వాలంటీర్ల కుటుంబాలకే ఎందుకు?

ADVERTISEMENT

ముందుగా అమరావతిలో దీనిని అమలుచేసి ప్రతిపక్షాల స్పందన ఏవిదంగా ఉంటుందో చూసి, ఒకవేళ అవి అభ్యంతరం చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల కుటుంబాలందరికీ పించన్ చెల్లించాలని వైసీపీ ప్రభుత్వం భావిస్తోందేమో?ఈవిదంగా వాలంటీర్లని గుప్పెట్లో పెట్టుకోగలిగితే రేపు ఎన్నికలలో వారందరూ కూడా వైసీపీని గెలిపించుకొనేందుకు గట్టిగా ప్రయత్నిస్తారని వైసీపీ భావిస్తున్నట్లుంది. ఒకవేళ రాబోయే ఎన్నికలలో వైసీపీ ఓడిపోయినా, తర్వాత వచ్చే ప్రభుత్వం కూడా తమ వాలంటీర్లకి పించన్ ఇచ్చేలా ఇప్పటి నుంచే పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నట్లు కూడా అనుమానం కలుగుతోంది.

ఇంత దూరదృష్టితో ఆలోచిస్తున్న వైసీపీ ప్రభుత్వం ఓపక్క హైకోర్టు వాలంటీర్ వ్యవస్థ చట్టబద్దతని ప్రశ్నిస్తున్నప్పుడు, మళ్ళీ వారి కుటుంబాలకి నెలనెలా పించన్ ఇస్తే హైకోర్టు ఏవిదంగా స్పందిస్తుంది? దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్లు పడితే, ప్రభుత్వానికి మొట్టికాయలు పడకుండా ఉంటాయా?అని ఆలోచించినట్లు లేదు.

ADVERTISEMENT
Latest Stories