ఏపీ, తెలంగాణలతో సహా దేశంలో అన్ని రాష్ట్రాలలో పలు సమస్యలు, ప్రభుత్వాలు తీసుకునే విధానపరమైన నిర్ణయాలు చివరికి అధికార ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేసుకునేందుకు మాత్రమే ఉపయోగపడుతున్నాయి.
ఉదాహరణకు ఏపీకి ప్రత్యేక హోదా, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ, మెడికల్ కాలేజీల నిర్మాణం వంటి అంశాలపై జరుగుతున్న రాజకీయాలు కనిపిస్తున్నాయి. ఇదేవిధంగా తెలంగాణలో బీసీ రిజర్వేషన్స్పై జరుగుతున్న రాజకీయాలు కనిపిస్తున్నాయి.
ప్రభుత్వాలు మారుతున్నా ఇటువంటి సమస్యలు అపరిష్కృతంగా మిగిలిపోవడమే కాకుండా వాటిపై అధికార ప్రతిపక్ష పార్టీలు రాజకీయాలు చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నాయి. పైగా వాటితోనే అవి రాజకీయాలు చేసుకుంటూ తమ ప్రత్యర్ధి పార్టీలపై పైచేయి సాధించాలని తాపత్రయపడుతున్నాయి కూడా.
ఒక సమస్యని పరిష్కరించలేని రాజకీయ పార్టీలు అదే సమస్యతో రాజకీయ లబ్ది పొందుతుతుండటమే విచిత్రమనుకుంటే, అలా తమని మభ్యపెడుతున్నారని తెలిసి కూడా బాధిత ప్రజలు ఆ నాయకులనే ఆశ్రయిస్తుండటం ఇంకా విడ్డూరం!
ప్రజలు ఇంత అమాయకంగా లేదా నిస్సహాయంగా ఉండటం వలననే తమని ఆశ్రయిస్తున్నారని గ్రహించిన నేతలు, నిర్లజ్జగా, నిర్భయంగా వారికి ఇంకా మాయ మాటలు చెపుతూ మభ్యపెడుతూనే ఉన్నారు.
ఉదాహరణగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని మేమే అడ్డుకుని కార్మికులను కాపాడమని అధికార ప్రతిపక్షపార్టీల నేతలు చెప్పుకోవడడం అందరూ చూస్తూనే ఉన్నారు.
దీనిపై నిన్నటి నుంచి మళ్ళీ అధికార ప్రతిపక్షపార్టీల మద్య వాదోపవాదాలు మొదలయ్యాయి. అవి వింటున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు ఎంత బాధపదుతున్నారో ఊహించుకోవచ్చు. వారి సమస్య, బాధ ప్రజలకి కూడా అర్ధం చేసుకోగలుగుతున్నారు. కార్మికుల జీవన్మరణ సమస్యపై అధికార, ప్రతిపక్షాలు ఈవిదంగా రాజకీయాలు చేస్తుండటం చాలా బాధాకరం. పొరుగు రాష్ట్రంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అయన కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని రాజకీయంగా వాడుకోవాలనుకున్నారు. ఎద్దు పుండు కాకికి రుచి అంటే ఇదేనేమో?
దశాబ్దాలుగా నడుస్తున్న వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణవైపు నడిపిస్తూ, దానికి కూతవేటు దూరంలో అనకాపల్లిలో కొత్తగా ఆర్సలార్-మిట్టల్ ప్రైవేట్ స్టీల్ ప్లాంట్ నిర్మిస్తుండటం మరో విశేషం.






