దేశంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు, తెలంగాణ మాజీ ఇంటలిజన్స్ అధినేత ప్రభాకర్ రావుకి సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.
ఈ కేసు విచారణలో దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకరించాలనే షరతు మీద ఆయనని అరెస్ట్ చేయకుండా సుప్రీంకోర్టు ఇదివరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
కానీ ఆయన ఏమాత్రం తమకి సహకరించడం లేదని సిట్ అధికారులు సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్ళడంతో, శుక్రవారం ఉదయంలోగా ఆయన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది!
ఈ కేసులో పోలీసులు తనని అరెస్ట్ చేస్తారనే భయంతోనే ఆయన చాలా కాలం అమెరికాలో ఉండిపోయారు. అరెస్ట్ చేయరాదని సుప్రీంకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాతే హైదరాబాద్ తిరిగి వచ్చి విచారణకు హాజరవుతున్నారు. కానీ సిట్ అధికారులకు సహకరించడం లేదు!
కనుక ఆయన భయపడినట్లే ఇప్పుడు పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టబోతున్నారు. కనుక ఆయన నోరు విప్పుతారా?విప్పితే ఈ కేసులో కేసీఆర్కి కూడా ఎంత ప్రమేయం ఉందో చెప్పేస్తారా? లేదా చెపితే ఇంకా పెద్ద సమస్యలో చిక్కుకుంటానని జైలులో గడపడానికే మొగ్గు చూపుతారా? రాబోయే రోజుల్లో తెలుస్తుంది.
కానీ సిట్ అధికారులు ఈ కేసులో ఆయన చేత మాట్లాడింఛి, సాక్ష్యాధారాలు సేకరించగలిగితే తర్వాత మాజీ సిఎం కేసీఆర్ వంతే రావచ్చు. కనుక కాళేశ్వరం కేసుకి బ్రేకులు పడినా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ముందుకు సాగితే ఇంకా ప్రమాదం.






