సిఎం జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటన గురించి సాక్షి మీడియా చాలా గొప్పగా చెప్పుకొంటున్నప్పటికీ, వాస్తవంగా రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు ఎంతో… ఎప్పుడు వస్తాయో చెప్పలేని పరిస్థితి.
ఇదే అంశంపై తెలంగాణ రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మొన్న ఓ సభలో మాట్లాడుతూ, “మన మంత్రి కేటీఆర్ దావోస్లో అడుగుపెట్టిన తొలిరోజే తెలంగాణ రాష్ట్రానికి వెయ్యి కోట్లు పెట్టుబడులు సాధించారు. కానీ పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రుల మీద ఈగ కూడా వాలలేదు,” అని అన్నారు.
తెలంగాణ మంత్రి పువ్వాడ ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటన గురించి మాట్లాడిన ఈ మాటలు సోషల్ మీడియాలో ఆ వీడియో వైరల్ అవుతున్నాయి.
ఇది వరకు తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా ఇలాగే ఆంధ్రప్రదేశ్లో రోడ్ల దుస్థితి, విద్యుత్ కోతలు, నీటి సరఫరా గురించి ఎద్దేవా చేస్తూ మాట్లాడినప్పుడు, ఏపీ మంత్రులు ఎదురుదాడి చేశారు. ఆ తరువాత ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో రోడ్ల మరమత్తులు ప్రారంభించింది. అది అప్రస్తుతం.
ఈసారి ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి దావోస్ పర్యటన వలన ఆంధ్రప్రదేశ్కి ఓరిగిందేమీ లేదన్నట్లు తెలంగాణ మంత్రి విమర్శించారు. ఆయన తమ అధినేతనే నేరుగా విమర్శించినప్పటికీ ఏపీ మంత్రులు ఎవరూ స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. బహుశః అమలాపురం అల్లర్లపై చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్లను విమర్శించడంలో అందరూ చాలా బిజీగా ఉన్నందునో లేక తెలంగాణ మంత్రి చెప్పిన మాటలతో వారు కూడా ఏకీభవిస్తున్నందునో కావచ్చు.



