మళ్ళీ మనమే అధికారంలోకి…. ఈ మాట మన రాజకీయ నాయకుల నోట తరచూ వినిపిస్తూనే ఉంటుంది. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ నోట కూడా వినిపించింది.
తెలంగాణలోని వికారాబాద్ జిల్లా అనంతగిరిలో ఏపీ, తెలంగాణ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ‘భవిష్యత్ మనదే’ అన్నారు. మోడీ ప్రభుత్వ విధానాలు, తీరుతో దేశ ప్రజలు వేసారిపోయారు. కనుక వచ్చే ఎన్నికలలో తప్పకుండా గెలిచి అధికారంలోకి వస్తామన్నారు.
ప్రజలు మార్పు కోరుకున్న ప్రతీసారి ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి. మోడీ 15 ఏళ్ళ పాలన తర్వాత ప్రజలు మార్పు కోరుకోవచ్చు. కోరుకోకపోవచ్చు.
అయితే మోడీ ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీయే ప్రత్యామ్నాయమని దేశ ప్రజలు భావిస్తున్నారా? రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీని ఒంటరిగా లేదా ఇండియా కూటమితో కలిసి ఎన్నికలలో గెలిపించుకోగలరా? ఆయనకు ఆ నాయకత్వ లక్షణాలు ఉన్నాయా?
ఆయన నాయకత్వాన్ని, ప్రధానిగా కూటమిలో పార్టీలు అంగీకరిస్తాయా?వంటి అనేక ప్రశ్నలు ఎప్పుడూ వినిపిస్తూనే ఉన్నాయి. పైపైన చూస్తేనే ఇన్ని సమస్యలు కనిపిస్తున్నప్పుడు, లోతుగా చూస్తే కాంగ్రెస్ పార్టీలో, ఇండియా కూటమిలో మరిన్ని సమస్యలు కనిపిస్తాయి.
కానీ ఈ ప్రశ్నలు, సమస్యలకు పరిష్కారం ఆలోచించకుండా, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది.. రాహుల్ ప్రధాని అవుతారని చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు కాంగ్రెస్ నేతలు.
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టినప్పుడు పార్టీలో నెలకొన్న ప్రతీ సమస్యని గుర్తించి పరిష్కరించుకుంటూ, కేసీఆర్ పాలన పట్ల ప్రజలలో నెలకొన్న వ్యతిరేకతకు అనుగుణంగా వ్యూహాలు రచించుకుంటూ ముందుకు సాగి పార్టీని గెలిపించుకొని ముఖ్యమంత్రి అయ్యారు.
మరి ఇలాంటి వాస్తవిక దృక్పదం రాహుల్ గాంధీకి ఉందా? అంటే లేదనే అనిపిస్తుంది. ప్రధాని మోడీని విమర్శించడమే రాజకీయమనుకుంటారు తప్పితే రేవంత్ రెడ్డిలా వాస్తవిక దృక్పదంతో ఆలోచించడం లేదనే అనిపిస్తుంది.
ఒకవేళ ఆలోచిస్తున్నట్లయితే ప్రధాని మోడీ, బిజేపి బలాలు, బలహీనతలు, ఆలోచనలు, వ్యూహాలకు అనుగుణంగా పార్టీని సిద్ధం చేసుకునేవారు. కానీ భవిష్యత్ మనదే అని చెప్పుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు.
నిజమే భవిష్యత్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో ఒకప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తుంది. కానీ ఎప్పుడంటే ప్రధాని మోడీ, అమిత్ షాల వ్యూహాలన్నీ ఫెయిల్ అయినప్పుడు! అంతవరకు ఇలాంటి పగటి కలలు కంటూ కాలక్షేపం చేయాల్సిందే.




