తెలంగాణలో కల్వకుంట్ల కవిత మే మొదటి వారంలో కొత్త పార్టీ ప్రారంభించబోతున్నారు. తమిళనాడులో నటుడు విజయ్ ఇప్పటికే టివికే పార్టీతో ఎన్నికల కోసం సిద్దమవుతున్నారు. తాజాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత స్నేహితురాలు శశికళ కూడా నేడు జయలలిత జయంతి సందర్భంగా చెన్నై మెరీనా బీచ్ వద్ద ఆమె సమాధిని దర్శించుకొని నివాళులు అర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “త్వరలోనే ఓ శుభవార్త చెప్తాను,” అన్నారు.
జయలలిత ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలోనే ఆమె అన్నాడీఎంకే పార్టీని మెల్లగా తన అధీనంలోకి తీసుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆమె మరణం తర్వాత తానే అన్నాడీఎంకే అధ్యక్షురాలినని ప్రకటించుకున్నారు.
అయితే అక్రమాస్తుల కేసులో జైలు పాలయ్యారు. నాలుగేళ్ళు జైలులో గడిపి సరిగ్గా ఎన్నికలకు ముందు బయటకు వచ్చారు. అప్పుడు రాజకీయాలలో చక్రం తిప్పేందుకు సిద్ధమయ్యారు. కానీ ఒకరోజు హటాత్తుగా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రజలకు బహిరంగ లేఖ విడుదల చేసి తప్పుకున్నారు.
అప్పటి నుంచి రాజకీయాలకు దూరంగానే ఉన్నారు. ఈ ఏప్రిల్-మే మద్యలో తమిళనాడు శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ అయ్యేందుకు సిద్ధమయ్యారు. ఆమె కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే విజయ్ టీవీకే పార్టీతో తమిళనాడులోని అధికార డీఎంకేతో పాటు ప్రతిపక్ష అన్నాడీఎంకే-బిజేపి కూటమి ఓట్లు కూడా చీలిపోతాయి. కనుక ఆయనతో పొత్తుకు బిజేపి అధిష్టానం చాలా ప్రయత్నించింది. కానీ అయన అంగీకరించలేదు.
కనుక విజయ్కి, డీఎంకే పార్టీలకు చెక్ పెట్టేందుకు బిజేపి-అన్నాడీఎంకే కూటమి శశికళతో ఏమైనా ఒప్పందం చేసుకుందా? అన్నాడీఎంకే పగ్గాలు ఆమెకి అప్పగించబోతోందా? లేదా ఆమె చేత కొత్త పార్టీ పెట్టించి డీఎంకే, విజయ్ పార్టీల ఓట్లు చీల్చి ఎన్నికలలో వాటిని దెబ్బతీసేందుకే ఆమెను బరిలో దింపుతున్నారా?
బిజేపి అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినందునే ఆమె మళ్ళీ రాజకీయాలలో యాక్టివ్ అవుతున్నారా? ఈ ప్రశ్నలన్నిటికీ త్వరలోనే తప్పక సమాధానాలు లభిస్తాయి.




