ఆంధ్రప్రదేశ్ కు దక్కాల్సిన ‘ప్రత్యేక హోదా’పై మరోసారి గళమెత్తారు శివాజీ. సినీ నటుడిగా, ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడిగా ఉన్న శివాజీ, హైదరాబాద్ లో ‘జాబు కావాలంటే ప్రత్యేక హోదా కావాలి’ అనే పోస్టర్ ను ఆవిష్కరించిన సందర్భంగా బిజెపి, టిడిపిలపై మండిపడ్డారు. ‘ప్రత్యేక హోదా’ కోసం తాము పోరాడుతుంటే తనను శివాజీ గాడు ఎవడు? వాడిది ఏ కులం? అని కొందరు ప్రశ్నిస్తున్నారని మండిపడ్డ శివాజీ, కులాలను మనం సృష్టించుకున్నామని, హోదా కోసం పోరాడుతుంటే మధ్యలో ఈ కులమెందుకు వచ్చింది? దీనిపై రాద్ధాంతం చేస్తున్నారేంటని దుయ్యబట్టారు.
హోదాపై ప్రజలను మభ్యపెట్టే విధంగా అన్నీ అబద్ధాలు చెబుతున్నారని, ప్రత్యేక హోదాతో లాభం లేదంటూ, ప్రత్యేక సాయం చేస్తామంటూ చెబుతున్నారని, అసలు ఇటువంటి మాటలు ఎన్ని రోజులు చెబుతారని ప్రశ్నించారు. వేరే దేశాలకు కూడా ప్రధాని మోడీ నిధులు ఇచ్చారని గుర్తు చేసిన శివాజీ, ఏపీకి ఇంతేనా? అంటూ ప్రశ్నించారు. టీడీపీ, బీజేపీలే ఆనాడు హోదాపై మాట్లాడాయని, హోదా వస్తే పరిశ్రమలు రావని అంటున్న వెంకయ్య నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ లాంటి వారు హోదాపై అడిగినప్పుడు ఎందుకు మీరు అసహనానికి గురవుతున్నారని… ‘మిమ్మల్ని అగడవద్దా.. ఇదేమైనా టిడిపి – బిజెపి కుటుంబానికి సంబంధించిన విషయమా?’ పలు రాష్ట్రాలకే ప్రత్యేక హోదా తీసేస్తున్నారని అంటున్నారు.. వాటి సమయం అయిపోయింది, అందుకే తీసేస్తున్నారు. ఆ రాష్ట్రాలతో లింకెందుకు పెడుతున్నారు? రాష్ట్రం పట్ల చిత్తశుద్ధి ఉంటే ఎవరైనా ప్రత్యేక హోదాని వదులుకుంటారా? తనలా ప్రశ్నించే వారిని తిడుతున్నారని, తప్పుడు ప్రచారాలతో మమ్మల్ని విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసారు.
పోలవరం అనేది జాతీయ ప్రాజెక్ట్… అది పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదే. దానిని ప్యాకేజ్ లో ఎందుకు చూపిస్తున్నారు? ప్యాకేజీతో డ్రామాలు ఆడుతున్నారు. ఏపీకి హోదా వస్తే గానీ, ఉద్యోగాలు రావని అన్న శివాజీ, మమ్మల్ని ఏం మాట్లాడవద్దని అంటున్నారు. హోదా వల్ల రాష్ట్రానికి 60 వేల కోట్ల రూపాయల ప్రయోజనం ఉంది… అందరూ గుర్తించండి అని రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు శివాజీ.



