మూడు రాజధానుల ప్రతిపాదనని ఏపీ రాజకీయాలలో ‘గేమ్ ఛేంజర్’ అని వైసీపీ అనుకొంటే అదే దానికి శాపంగా మారుతున్నట్లుంది. ఇదే అంశంపై మూడు రోజుల వ్యవధిలో మళ్ళీ సుప్రీంకోర్టు తలుపు తట్టిన వైసీపీ ప్రభుత్వానికి మరోసారి అవమానమే ఎదురైంది. రాజధాని కేసు విచారణని త్వరగా చేపట్టాలని కోరుతూ, రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాదులు జస్టిస్ కెఎం జోసఫ్ ధర్మాసనానికి ఈరోజు విజ్ఞప్తి చేశారు. అయితే అందుకు ధర్మాసనం నిరాకరించింది. ఈనెల 28న ఈ కేసు విచారణని చేపడతామని ముందే చెప్పాము కనుక అదేరోజు విచారణ చేపడతామని, అంతకంటే ముందుగా సాధ్యం కాదని చెప్పారు.
ఈ కేసు ప్రాధాన్యతని దృష్టిలో ఉంచుకొని మార్చి 29,30 వ తేదీలలో కూడా విచారణ చేపట్టాలని ప్రభుత్వం తరపు న్యాయవాదులు చేసిన విజ్ఞప్తిని కూడా ధర్మాసనం తిరస్కరించింది. ఆ రెండు రోజులలో ముందే నిర్ణయించిన వేరే కేసులున్నందున రాజధాని కేసుని 29,30 తేదీలలో విచారణ చేపట్టలేమని ధర్మాసనం తేల్చి చెప్పింది.
దీనిపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ మాత్రమే నిర్ణయం తీసుకోగలరని జస్టిస్ జోసఫ్ చెప్పగా, అయితే ఆయనకి విజ్ఞప్తి చేసేందుకు తమని అనుమతించాలని ఏపీ ప్రభుత్వ న్యాయవాదుల అభ్యర్ధనని కూడా జస్టిస్ జోసఫ్ తిరస్కరించారు.
అయితే ఈ సందర్భంగా జస్టిస్ జోసఫ్ ధర్మాసనం ఏపీ రాజధానిపై చేసిన వ్యాఖ్యలు గమనిస్తే, ఏపీ రాజధాని కేసుపై సుప్రీంకోర్టు ఎటువంటి అభిప్రాయంతో ఉందో చూచాయగా అర్దమవుతుంది. “ఏపీ రాజధాని కేసు చాలా విస్తృతమైనది. దీనిలో రాజ్యాంగపరమైన అంశాలు అనేకం ఇమిడి ఉన్నాయి. కనుక అన్నిటినీ పరిగణనలోకి తీసుకొని విచారణ జరిపినప్పుడే పూర్తి న్యాయం చేయగలుగుతాము. ప్రస్తుత పరిస్థితిలో ఈ కేసు గురించి ఇంతకు మించి మాట్లాడలేము,” అని చెప్పారు.
“ఈ కేసు విచారణ ముందుకు జరుపలేము… మర్నాడు రెండు రోజులకు పొడిగించలేము… ఈ కేసు చాలా విస్తృతమైనది… కనుక పూర్తి న్యాయం చేయాలంటే లోతుగా విచారణ జరపాల్సి ఉంటుంది…” అనే వ్యాఖ్యలు గమనిస్తే ఈ కేసు విచారణకు సుప్రీంకోర్టు ఏమాత్రం తొందరపడటం లేదని స్పష్టం అవుతోంది. అంతేకాదు… ఏదో ఆషామాషీగా విచారణ జరిపి వైసీపీ కోరుకొన్నట్లు తీర్పు చెప్పబోదని అర్దం అవుతోంది. ఇంకా ఒత్తిడి చేస్తే సుప్రీంకోర్టు ఆగ్రహానికి గురికావలసి ఉంటుందనే విషయం కూడా నేడు స్పష్టమైంది.
ఇవన్నీ చూస్తుంటే వైసీపీకి అమరావతి రైతుల ఉసురు బాగానే తగిలిన్నట్లుంది. మూడు రాజధానుల పేరుతో టిడిపి, జనసేనలకి వ్యతిరేకంగా ప్రజలని ఉసిగొల్పి వాటిని రాజకీయంగా దెబ్బతీద్దామని గొయ్యి తవ్వితే చివరికి వైసీపీయే ఆ గోతిలో పడబోతున్నట్లుంది! ఏం చేస్తాం… అంతా స్వయంకృతమే కనుక ఏం జరిగినా ఎన్ని ఎదురుదెబ్బలు తగులుతున్నా భరించక తప్పదు!



