రాజధానికి ఇప్పుడెందుకు ఇంత తొందర?

YS-Jagan-Supreme-Courtవైసీపీ ప్రభుత్వం గత మూడున్నరేళ్ళుగా మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతోంది. ఓసారి మూడు రాజధానులంటారు… మరోసారి విశాఖ ఒక్కటే రాజధాని అని వాళ్ళే అంటారు. కర్నూలు న్యాయరాజధాని అంటారు కానీ అక్కడ హైకోర్టు ఉండదని సుప్రీంకోర్టుకి, ఉంటుందని ప్రజలకి చెపుతుంటారు.

ADVERTISEMENT

మూడు రాజధానులు ఏర్పాటు చేయవలసింది అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వమే అయినప్పటికీ మంత్రులు, ఎమ్మెల్యేలే రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తూ మూడు ప్రాంతాల ప్రజలని రెచ్చగొడుతుంటారు. వారి ఈ వేర్పాటువాదం ఏ స్థాయికి చేరుకొందంటే ఉత్తరాంద్ర జిల్లాలన్నిటినీ కలిపి విశాఖని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని కోరేంతవరకు!

మూడు రాజధానుల ఏర్పాటుపై హైకోర్టు అభ్యంతరం చెప్పినప్పుడు, వైసీపీకి నిజంగా దానిపైనైనా చిత్తశుద్ధి ఉండి ఉంటే వెంటనే సుప్రీంకోర్టులో సవాలు చేసి ఉండాలి. కానీ హైకోర్టు తీర్పు చెప్పిన ఆరునెలల తర్వాత సుప్రీంకోర్టులో సవాలు చేసింది. అంటే మూడు రాజధానుల అంశంపై వైసీపీ ఉద్దేశ్యపూర్వకంగానే ఆలస్యం చేసిన్నట్లు అర్దం అవుతోంది.

ఈ మూడు ముక్కలాటతో మూడున్నరేళ్ళు కాలక్షేపం చేసేసి, ఆరు నెలల తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసిన వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు తక్షణం దానిపై విచారణ జరిపి తీర్పు చెప్పేయాలని సుప్రీంకోర్టుపై ఒత్తిడి చేస్తోంది. రెండు రోజుల క్రితమే ఇదేవిషయమై సుప్రీంకోర్టుని కదపగా, మార్చి 28న విచారణ చేపడుతామని తెలియజేసింది. మళ్ళీ ఇవాళ్ళ మరోసారి మూడు రాజధానులు కేసుపై త్వరగా విచారణ జరపాలని సుప్రీంకోర్టుని కోరబోతోంది.

మూడున్నరేళ్ళు కాలక్షేపం చేసిన వైసీపీ ప్రభుత్వం మరో మూడు వారాలు ఎందుకు ఆగలేకపోతోంది?మార్చి 28న విచారణ జరుపుతామని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ తక్షణమే విచారణ జరపాలని ఎందుకు పట్టుబడుతోంది?

రేపటి నుంచి విశాఖలో జరుగబోయే గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్‌లో మళ్ళీ మరో కాకమ్మ కధ ఏదో చెప్పుకొనేందుకా?లేదా తీర్పు సానుకూలంగా వస్తే, ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు సమ్మె మొదలుపెట్టేలోగా మూడు రాజధానుల అజెండాతో ముందస్తు ఎన్నికలకి వెళ్లాలని ప్లాన్ చేస్తోందా?

వైసీపీకి మూడు రాజధానులు రాజకీయ అజెండా కావచ్చు కానీ సుప్రీంకోర్టుకి కాదు. కనుక దీని గురించి పదేపదే ఒత్తిడి చేయడంపై సుప్రీంకోర్టు ఏవిదంగా స్పందిస్తుందో ఊహించవచ్చు.

ADVERTISEMENT
Latest Stories