టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేసిన తర్వాత రాష్ట్రంలో రాజకీయబలాబలాలు మారుతున్నాయి. టిడిపి, జనసేనలు కలిసి పోటీ చేయడం ఖాయమని తేలిపోయింది.
జనసేనతో పొత్తు ఉందని ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి చెపుతున్నారు కానీ వారి అధిష్టానం చెప్పడం లేదు. బీజేపీని విడిచిపెట్టి వస్తే టిడిపి-జనసేనలతో కలిసి పనిచేసేందుకు సిద్దంగా ఉన్నామని సీపీఐ, సీపీఎంలు చెపుతున్నాయి.
వచ్చే ఎన్నికలలో వైసీపి ఒంటరిగా పోటీ చేస్తుందని జగన్మోహన్ రెడ్డి చెప్పుకొంటున్నప్పటికీ, ఆయనకు వెనక నుంచి మద్దతు ఇచ్చి మళ్ళీ గెలిపించేందుకు మోడీ, అమిత్ షా, కేసీఆర్ సిద్దంగా ఉన్నారని చంద్రబాబు నాయుడు అరెస్టు తర్వాత పరిణామాలతో స్పష్టమవుతోంది.
ప్రస్తుతం టిడిపి బలహీనంగా ఉంది కనుక ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైసీపి అవలీలగా గెలుస్తుందని అందరూ భావిస్తుండవచ్చు. అయితే ఒక్క చంద్రబాబు నాయుడు అరెస్టు వైసీపి విజయావకాశాలను తారుమారు చేయవచ్చని తాజా సర్వేలో తేలింది.
ప్రముఖ సర్వే సంస్థ ‘ఇండియన్ పోలిటికల్ సర్వే అండ్ స్ట్రాటజీ టీమ్’ చేసిన తాజా సర్వే ప్రకారం టిడిపి ఒంటరిగా పోటీ చేసినా 175కి 86 సీట్లు గెలుచుకోగలదని తేల్చి చెప్పింది. వైసీపికి 68, జనసేనకు 6 సీట్లు లభిస్తాయని చెప్పింది. తాజా సర్వేలో టిడిపి పొత్తులతో ఎన్నికలకు వెళితే ఫలితాలు ఎలా ఉంటాయో అంచనాలు తెలియజేసింది.





