టీడీపీ – జనసేన మధ్య రాజకీయ విద్వేషాలు రాజుకోవాలని, బాబు – పవన్ ల మధ్య రాజకీయ ఆధిపత్య చిచ్చు రగలాలని, లోకేష్ – పవన్ ల బంధం రాజకీయ పదవులలో కాలిపోవాలని నిత్యం వెయ్యి కళ్ళతో ఎదురుచూసే వైసీపీ ఆశలను ఈ ముగ్గురి తమ అనుబంధంతో ఛిదిమేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు ప్రసంగించే ప్రతి బహిరంగ సభలోను ఆయన ఉప ముఖ్యమంత్రి పవన్ ప్రస్తావన తేవడం, పవన్ రాష్ట్రం కోసం తగ్గిన విధానాన్ని గుర్తు చేయడం, అలాగే పవన్ కూడా బాబు పాలనానుభవాన్ని ప్రశంసించడం, ఆయన విజనరీ కి జై కొట్టడం తరచుగా ఇరు పార్టీల శ్రేణులు గమనిస్తూనే వస్తున్నారు.
ఇటీవల అంబటి అరెస్టు వ్యవహారాన్ని వైసీపీ కమ్మ – కాపు అనే కుల వివాదంగా మార్చాలని శతవిధాలా ప్రయత్నించినా రాష్ట్రంలో ఆ వివాదం తెరమీదకు రాకపోవడం వెనుక కూడా ఈ ఇరువురి నేతల రాజకీయ బంధం కీలక పునాది వేసిందనే చెప్పాలి.
ఇలా వైసీపీ వేసే రాజకీయ వ్యూహాలను ఈ ఇరువురి నేతలు తమ స్నేహంతో ఎప్పటికప్పుడు ఛిదిమేస్తూనే వస్తున్నారు. వీరి ఈ బంధం ఇలానే కొనసాగితే వైసీపీ 2.0 కి అసలు అవకాసమే ఉండదనే ఆందోళన వైసీపీ ని భయంకరంగా వెంటాడుతుంది. అయితే ఈ ఇద్దరి తాజా భేటీ వైసీపీ ని మరోసారి ఆలోచనలో పడేసిందనే చెప్పాలి.
నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు ఉండవల్లి బాబు ఇంట్లో సమావేశమయ్యారు. అలాగే సుమారు రెండు గంటల పాటు ఈ ఇద్దరి నేతల మధ్య రాజకీయ చర్చలు సాగాయి.
అయితే కీలక నామినేటెడ్ పదవుల భర్తీ, రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, రాష్ట్రంలో సంచలనంగా మారిన కేసుల ముగింపు వంటి తదితర ముఖ్యమైన రాజకీయ అంశాల పై ఈ ఇద్దరు నేతల భేటీ కొనసాగినట్టు సమాచారం. అలాగే దానికి తోడు వైసీపీ సోషల్ మీడియా చేస్తున్న ఫేక్ ప్రచారాలు, మార్ఫింగ్ వీడియోల పై కఠిన చర్యలకు రంగం సిద్ధం చేసేలా నిర్ణయాలు ఉండబోతున్నాయి.




