తెలంగాణ పంచాయితీ…పార్టీలకు క్లారిటీ వచ్చినట్టేనా.?

Telangana panchayat elections results showing Congress, BRS and BJP performance

తెలంగాణలో జరిగిన పంచాయితీ ఎన్నికలు ఇటు అధికార అటు ప్రతిపక్ష పార్టీలతో పాటుగా బీజేపీ కి కూడా ఒక స్పష్టత ఇచ్చినట్లయ్యింది. ముందుగా అధికార కాంగ్రెస్ విషయానికొస్తే, రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన పంచాయితీ ఎన్నికలలో కాంగ్రెస్ సుమారు 50 % పైబడి పంచాయితీలను తన ఖాతాలో వేసుకుంది.

ఇందులో కొన్ని ఏకగ్రీవాలు కాగా మిగిలినవి ఎన్నికల ప్రక్రియలో భాగంగా కాంగ్రెస్ చేజిజిక్కించుకుంది. సాధరణంగా అధికారంలో ఉన్న పార్టీలకు ఈ స్థానిక సంస్థల ఎన్నికలు నెగ్గడం చాల సులభం. అందునా ఇంకా రేవంత్ సర్కార్ కు మూడేళ్ళ కాలపరిమితి ఉంది.

ADVERTISEMENT

దీనితో అధికార పార్టీని కాదని ప్రజలు ప్రతిపక్ష పార్టీల వైపు చేసేందుకు సాహసించరు. కాబట్టి కాంగ్రెస్ గెలుపు ఊహించిందే అయినప్పటికీ ఆ గెలుపు పరిధి ఎంత అనేది ఇక్కడ చర్చించాల్సిన అంశం. సహజంగా అధికార పార్టీ 70 నుంచి 80 శాతం వరకు పంచాయితీలను గెలుచుకునే అవకాశం ఉంటుంది.

కానీ కాంగ్రెస్ 50% , అంతకు మరి కొంచెం తో సరిపెట్టింది అంటే అది ఖచ్చితంగా అధికార పార్టీ ఆలోచించాల్సిన అంశం. అధికారంలో ఉండి తాజాగా జూబ్లీహిల్స్ వంటి బిఆర్ఎస్ బలమైన స్థానంలో కూడా విజయకేతనం ఎగరేసి ఇలా 50% పంచాయితీలతో కాంగ్రెస్ సరిపెట్టుకుంది అంటే అది ప్రతిపక్షాల బలాన్ని కూడా సూచించినట్లవుతుంది.

ఇక బిఆర్ఎస్ సంగతి గమనిస్తే, పార్టీ అధినేత కేసీఆర్ అజ్ఞాతంలో, బిఆర్ఎస్ నేతల పై కవిత విమర్శలతో బిఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పటికీ ఇంకా తెలంగాణలో తన పార్టీ స్థానాన్ని కాపాడుకుంటూ కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం బిఆర్ఎస్ అనేలా గులాబీ కారు గ్రామాలలో తన పట్టునిలుపుకుంది.

అధికార పార్టీకి గట్టి పోటీగా, బీజేపీ కి ప్రత్యర్థిగా బిఆర్ఎస్ పంచాయితీ ఎన్నికలలో రెండవ స్థానాన్ని కైవశం చేసుకుని తన పార్టీ పరువు నిలుకోగలిగింది. కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయం మేమే, తెలంగాణలో బిఆర్ఎస్ కారు ఖాళీ, తెలంగాణ అధికార పీఠమే మా లక్ష్యం అంటూ బీజేపీ చేసిన హడావుడి రాజకీయమంతా కేవలం ప్రకటనలే పరిమితం అని తేలిపోయింది.

టి. బీజేపీ లో ఉన్న సమన్వయ లోపంతో పాటు ఒక నిర్దిష్ట స్పష్టత లేని రాజకీయం బీజేపీ ని ముందుకు రానివ్వడం లేదు. ఇన్నేళ్ల పోరాటాల తరువాత కూడా టి. బీజేపీ పంచాయితీ ఎన్నికలలో స్వతంత్రుల కన్నా కిందన అంటే నాల్గవ స్థానానికి పరిమితం అవ్వడం అంటే అది బీజేపీ నాయకత్వ లోపానికి నిదర్శనం.

దీని బట్టి చూస్తే అధికార కాంగ్రెస్ తన అధికారాన్ని నిలబెట్టుకున్నట్టే ప్రతిపక్ష బిఆర్ఎస్ కూడా తన ప్రతిపక్ష స్థానాన్ని కాపాడుకుంది. కానీ సార్వత్రిక ఎన్నికలలో మూడవ స్థానంలో ఉన్న బీజేపీ ఇప్పుడు దాన్ని కూడా కోల్పోయి మరో మెట్టు దిగజారింది. కావున ఇక్కడ ఎలర్ట్ లో ఉండాల్సింది అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం కోసం పాకులాడుతున్న బీజేపీ అనేది సుస్పష్టం.

ADVERTISEMENT
Latest Stories