ప్రపంచంలో శాంతి నెలకొల్పాల్సిన బాధ్యత తనపైనే ఉందనుకుంటుంది అమెరికా. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్! కనుక ఇరాన్తో యుద్ధం మొదలుపెట్టేశారు.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ ఆయనకు కుడి భుజం వంటి వారు. చూసి రమ్మంటే కాల్చి వచ్చే రకం. కనుక యుద్ధ విమానాలు పంపించి ఇరాన్ మీద బాంబుల వర్షం కురిపించి యుద్ధానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.
కనుక అమెరికా కూడా తమ అత్యాధునిక క్షిపణులు, ఆయుధాలను ఇరాన్ ప్రజల మీద పరీక్షించుకుంటోంది.
ఇరాన్ అధ్యక్షుడు ఆయతుల్లా ఖోమైనీ పుష్పరాజ్ వంటివారు కనుక తగ్గేదేలే అంటూ ఒకేసారి ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, కువైట్, అబుదాబీ, ఖతార్, జోర్డాన్, యూఏఈలలో అమెరికా స్థావరాలపై క్షిపణులు వేశారు.
“ఈ యుద్ధాన్ని అమెరికా, ఇజ్రాయెల్ ప్రారంభించినప్పటికీ దీనిని మేమే ముగిస్తాము. ఆ ముగింపు మీరు తట్టుకోలేరు,” అంటూ పంచ్ డైలాగ్ కూడా చెప్పారు.
కానీ యుద్ధం ఏదైనా క్లైమాక్స్ అమెరికా చేతిలోనే ఉంటుంది. ఆ క్లైమాక్స్ సీన్లో విలన్గా ముద్ర వేసిన ఆ దేశాధ్యక్షుడుని బందించి అమెరికా పట్టుకుపోవడమో కుదరకపోతే బాంబులు వేసి మట్టుపెట్టడమో చేస్తుంది. కనుక ఇరాన్ అధ్యక్షుడు ఆయతుల్లా ఖోమైనీ కథ కూడా బహుశః ఇలాగే ముగియవచ్చు.
డోనాల్డ్ ట్రంప్ ఒక్కో దేశంపై ఒక్కో పేరుతో యుద్ధం చేస్తూ బలవంతంగా లొంగదీసుకుంటుంటే ఐఖ్యరాజ్యసమితి నిస్సహాయంగా చూస్తూ ఉండిపోవడం ఇంకా బాధాకరం.
అయితే సాటి దేశంపై దాడులు చేయడానికి గల్ఫ్ దేశాలు తమ భూభాగాలను అమెరికా సైనిక దళాలకు అప్పగించడం చాలా బాధాకరం. అమెరికా వలన ఇరాన్ ఇప్పుడు సాటి గల్ఫ్ దేశాలపై కూడా దాడులు చేయాల్సి వస్తోంది. తద్వారా ఆయా దేశాలు అయిష్టంగానైనా యుద్ధంలో జేరాల్సిన పరిస్థితి ఏర్పడితే, ప్రశాంతంగా ఉండే గల్ఫ్ దేశాలు ఒకేసారి భగ్గున మండుతాయి.
ఇదంతా కూడా ప్రపంచశాంతి స్థాపనకే అని ట్రంప్ చెపితే మనం ఊ అనాలే తప్ప ఊహూ అనరాదు. అంటే టాక్స్ పెరుగుతుంది. కనుక ఇప్పుడు మనం చేయాల్సిన పని పరిస్థితులను నిశితంగా గమనిస్తుండటమే!




