రెండు మరకలు… ఇప్పుడు ఏ సబ్బుతో ఉతుకుతారో?

KCR-Kavitha-Kalavakuntlaతెలంగాణ సిఎం కేసీఆర్‌ బిఆర్ఎస్‌ పార్టీతో అట్టహాసంగా జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనుకొంటే, ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కారణంగా అడుగు ముందుకు వేయలేకపోతున్నారు. మళ్ళీ రేపు (గురువారం) ఆయన కుమార్తె కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజరుకావలసి ఉంది. నాలుగు రోజుల క్రితం మొదటిసారి ఆమె ఈడీ విచారణకు హాజరైనప్పుడు బిఆర్ఎస్‌ పార్టీ చాలా హడావుడే చేసింది. దాంతో ఆమెకు ప్రజల సానుభూతి సంపాదించి ఉండవచ్చు. కానీ ఆమె విచారణకు హాజరైనప్పుడల్లా ఆమె కోసం బిఆర్ఎస్‌ హడావుడి చేస్తే తెలంగాణ ప్రజలలో సానుభూతికి బదులు బిఆర్ఎస్‌ పట్ల దురభిప్రాయం ఏర్పడినా ఆశ్చర్యం లేదు.

సరిగ్గా ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్‌ (టిఎస్‌పీఎస్సీ)లో ప్రశ్నాపత్రాల లీకేజి వ్యవహారం బయటపడింది. ఇప్పటికే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో ఇబ్బంది పడుతున్న బిఆర్ఎస్‌ ప్రభుత్వానికి ఈ టిఎస్‌పీఎస్సీ స్కామ్‌ మరో తలనొప్పిగా మారింది. ముఖ్యంగా కేసీఆర్‌ ప్రభుత్వానికి ఇది తీరని అప్రదిష్టగా నిలుస్తోంది.

ADVERTISEMENT

కేసీఆర్‌ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు, మిషన్ భగీరధ ప్రాజెక్టులలో భారీగా అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్‌, బిజెపిలు చాలా కాలంగా ఆరోపణలు చేస్తున్నాయి. వాటి చేతికి ఇప్పుడు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌తో బాటు ఇప్పుడు ఈ టిఎస్‌పీఎస్సీ స్కామ్‌ గొప్ప ఆయుధంగా అందిరావడంతో కేసీఆర్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ప్రజలను ఆకట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయి.

కేసీఆర్‌ ఏ ముహూర్తంలో జాతీయరాజకీయాలలోకి వెళ్ళాలని అనుకొన్నారో తెలీదు కానీ మొదటి నుంచి అవరోదాలే ఎదురవుతున్నాయి. దేశ రాజకీయాలలో గుణాత్మకమైన మార్పు తెస్తానని, దేశానికి తెలంగాణ రోల్ మోడల్ అవసరమని చెపుతున్న కేసీఆర్‌పై ఇప్పుడు రెండు మచ్చలు పడ్డాయి. ఒకేసారి రెండు స్కామ్‌లను ఎదుర్కోవలసి వస్తోంది.

ఈ పరిస్థితులలో కేసీఆర్‌ జాతీయ రాజకీయాల కోసం ఇప్పుడు ఢిల్లీలో కాదు గదా వేరే ఏ ఉత్తరాది రాష్ట్రంలో కూడా అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొంది. పెడితే జాతీయ మీడియా ఈ లిక్కర్, పేపర్ స్కామ్‌ల గురించే నిలదీస్తుందని వేరే చెప్పక్కరలేదు. కనుక కేసీఆర్‌ జాతీయ రాజకీయాలకు మరికొంతకాలం బ్రేక్ పడిన్నట్లే భావించవచ్చు.

అసలు కేసీఆర్‌ని జాతీయ రాజకీయాలలో ప్రవేశించనీయకుండా తెలంగాణకే పరిమితం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవితని ఇరికించిందని బిఆర్ఎస్‌ నేతలు సరికొత్త వాదన వినిపిస్తున్నారు. కానీ కేసీఆర్‌కి అంటుకొన్న ఈ రెండు మరకలే అందరికీ కనిపిస్తాయి తప్ప ఇటువంటి వాదనలను ఎవరు వింటారు?ఎవరు నమ్ముతారు?

ADVERTISEMENT
Latest Stories