శోభకృత్ నామ ఏపీ రాజకీయ పంచాంగం

Ugadi_2023_Panchangam_Jagan_Chandrababu_Naiduనేడు ఉగాది. సాధారణ ప్రజలకు కాస్త అటూ ఇటూగా సాధారణ జీవితాలే ఉంటాయని, ఆదాయం పెరగకపోయినా ఖర్చులు పెరుగుతూనే ఉంటాయంటూ దాదాపు వాస్తవ పరిస్థితులనే చెపుతుంటారు. కానీ రాజకీయ పంచాగాల లెక్కలు వేరేగా ఉంటాయి. ఎవరి పంచాంగం వారికే అనుకూలంగా చెపుతుంది. అంటే సొంత మీడియాలాగన్న మాట!

ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రులు జగన్‌, కేసీఆర్‌లకు అత్యంత ఆప్తుడు, వైసీపీ ప్రభుత్వ ఆస్థాన పీఠాధిపతి శ్రీ రూపానందేంద్రస్వామి కూడా ఈరోజు పంచాంగం చెప్పారు. ఈ శోభకృత్ నామ సంవత్సరంలో రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు, అక్కడ ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోడీకి సమస్యలు తొలగిపోయి అనుకూల పరిస్థితులు ఏర్పడుతాయని చెప్పారు. అయితే చతుర్ గ్రహ కూటమితో కొత్త సంవత్సరం ప్రారంభం అయినందున దేశానికి కొన్ని ఇబ్బందులు తప్పవని చెప్పారు. వేసవిలో ఎండలు, వడగాడ్పులు, వర్షాకాలంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పారు.

ADVERTISEMENT

అయితే వాస్తవ పరిస్థితులు చూస్తే, ఈ ఏడాది ఏపీ అధినేత స్థితి ఏవిదంగా ఉండబోతోందో ఊహించవచ్చు. ముందుగా ఈ కొత్త సంవత్సరం ప్రారంభంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలలో ఎదురుదెబ్బ తగిలింది. ఈ ప్రభావం వలన పార్టీ అధినేతలో అభద్రతాభావం పెరగడం సహజం కనుక ఈ ఓటమిపై ఆత్మపరిశీలన పేరుతో కొంతమందిపై వేటు వేయవచ్చు. ఈ ప్రభావంతో కొందరు వైసీపీ నుంచి బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది.

ఈ ఎన్నికలతో టిడిపి మళ్ళీ పుంజుకొని బలపడుతోందని స్పష్టం అయ్యింది కనుక టిడిపి నేతలకు వైసీపీ నుంచి అగ్నిపరీక్షలు తప్పకపోవచ్చు.

ఇక ప్రస్తుతం ఉన్న ఆర్ధిక పరిస్థితులలో ఉద్యోగులకు నెలనెలా టంచనుగా జీతాలు చెల్లించడం, వారి బకాయిలన్నీ తీర్చేసి, వారి డిమాండ్స్ నెరవేర్చి పూర్తిగా సంతృప్తిపరచడం అసాధ్యం. కనుక వారితో వైసీపీ ప్రభుత్వానికి సమస్యలు తప్పకపోవచ్చు. ఒకవేళ డిసెంబర్‌లోగా వారితో సర్దుబాటు కాకపోతే వచ్చే ఎన్నికలలో వారు వైసీపీకి వ్యతిరేకంగా ఓట్లు వేయడం ఖాయం.

ఇక సంక్షేమ పధకాలను కొనసాగించాడనికి అప్పులు చేయక తప్పదు కనుక అవి నానాటికీ పెరుగుతూనే ఉంటాయి. అప్పులున్నప్పుడు వడ్డీలూ ఉంటాయి. ఆ భారం నానాటికీ పెరుగుతూనే ఉంటుంది. కనుక అది ఎప్పటికప్పుడు పన్నులు, ఛార్జీల పెంపు రూపంలో ప్రజలపై పడుతుంటుంది. కనుక సామాన్య, మద్యతరగతి ప్రజల ఇబ్బందులు ఇంకా పెరిగే అవకాశమే ఉంది.

ప్రధాని నరేంద్రమోడీ, అమిత్‌ షాల పట్ల సిఎం జగన్‌ చాలా విధేయంగానే ఉంటున్నారు కనుక అక్రమాస్తుల కేసులతో ఇబ్బందులు ఉండకపోవచ్చు. కానీ వివేకా హత్య కేసు, లిక్కర్ స్కామ్‌ కేసులు మాత్రం భూతంలా వెంటాడుతూనే ఉంటాయి కనుక వాటితో వైసీపీకి కొంత నష్టం అనివార్యమే. సిఎం జగన్మోహన్ రెడ్డి, ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి తమ మంత్రదండాలు తిప్పి ఈ ఏడాది చివరిలోగా అప్పులన్నీ తీర్చేసి, రూ.13.56 లక్షల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలు ఏర్పాటు చేసేసి ఆరు లక్షలమందికి ఉద్యోగాలు కల్పించేస్తే పర్వాలేదు లేకుంటే వైసీపీ పరిస్థితులు తారుమారుకావచ్చు.

ADVERTISEMENT
Latest Stories