రేపు (సోమవారం) వెలిగొండ ప్రాజెక్టుని సిఎం చంద్రబాబు నాయుడు ప్రారంభించి జాతికి అంకితం చేయబోతున్నారు. దీని కోసం గత రెండేళ్ళుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక నేతలు, సీఎంవోతో సహా వివిధ శాఖల అధికారులు చాలా సమన్వయంతో పనిచేసినందునే ఇది సాధ్యపడింది.
వెలిగొండ సొరంగ మార్గంలో అడ్డంగా ఉన్న టన్నల్ బోరింగ్ మెషిన్ తొలగింపు పనులు జరుగుతుంటే, మరో పక్క టన్నల్ లోపల సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ వర్క్స్ జరిగాయి. బయట హెడ్ రెగ్యులేటర్ మొదలు నల్లమల్ల సాగర్ వరకు సివిల్ పనులు చకచకా కొనసాగాయి. రెండేళ్ళుగా కాంట్రాక్ట్ కంపెనీ ఇంజనీర్లు, కార్మికులు కూడా రేయింబవళ్ళు చాలా కష్టపడి పనిచేశారు.
వీటన్నిటినీ పర్యవేక్షిస్తూనే నిర్వాసిత కుటుంబాల వివరాలు సేకరించి నష్టపరిహారం చెల్లింపులు జరిపారు. కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ప్రభుత్వం ఆ కేసులను ఎదుర్కోక తప్పలేదు. ఇవన్నీ సరిపోవన్నట్లు వైసీపీ చేసే రాజకీయాలు ఉండనే ఉన్నాయి. అన్ని పనులను, అన్ని శాఖలను, అందరినీ సమన్వయం చేసుకుంటూ, ఎప్పటికప్పుడు అవసరమైన నిధులు విడుదల చేస్తూ వెలిగొండ ప్రాజెక్టు పనులు గడువు ప్రకారం పూర్తిచేశారు.
వెలిగొండ కోసం త్యాగాలు చేసిన నిర్వాసిత కుటుంబాలతో పాటు, వివిధ కారణాల వలన నిర్వాసితుల సర్వేలో పేర్లు నమోదు చేసుకోలేకపోయిన వారికి కూడా నష్ట పరిహారం చెల్లించాలని సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారని మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు.
ముఖ్యమంత్రి సూచనల మేరకు కటాఫ్ డేట్ తర్వాత కూడా అర్హులైన వారికి రూ.169 కోట్ల ఎక్స్ గ్రేషియా ఇచ్చేలా నిర్ణయం తీసున్నారు. మొత్తం 1,800 పిర్యాదులు, పిటిషన్లను క్షుణ్ణంగా పరిశీలించి వారందరికి కూడా న్యాయం చేసేలా చర్యలు చేపట్టామని మంత్రి తెలిపారు. 2019 కటాఫ్ డేట్ నుంచి 2026 వరకూ 18 ఏళ్ళు నిండిన యువతకు కూడా రూ.2 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ఇవ్వబోతున్నామని తెలిపారు. నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపు కోవచ్చు. కానీ ప్రతీ కుటుంబానికి నెల రోజులకు సరిపడా రేషన్ సరుకులు ఇవ్వాలని సిఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు.
జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నిర్వాసితులకు నష్టపరిహారం చెల్లించకుండా, సొరంగ మార్గంలో అడ్డంగా ఉన్న టన్నల్ బోరింగ్ మెషిన్ని బయటకు తీయకుండానే వెలిగొండని ప్రారంభించి జాతికి అంకితం చేసేశారు. కానీ చంద్రబాబు నాయుడు ఇంత వేగంగా అన్ని పనులు పూర్తిచేయించారు.
ముఖ్యంగా నష్టపరిహారంతో పాటు నిన్న రాఖీ పండుగ సందర్బంగా నిర్వాసిత మహిళలకు పసుపు, కుంకుమలతో చీరలు కూడా పెట్టి సగౌరవంగా వీడ్కోలు పలికామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.
ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నిర్వాసితులు కూడా వచ్చి సంతోషించాలి కానీ వారి కన్నీళ్ళు పెట్టుకునే పరిస్థితి ఉండకూడదు. సిఎం చంద్రబాబు నాయుడు ఇదే చేశారు.







