సాగునీటి ప్రాజెక్టులంటే దశాబ్దాల పాటు పనులు సాగుతుంటాయని ప్రజలు కూడా నమ్మే పరిస్థితికి వచ్చారు. ఒకప్పుడు నాగార్జున సాగర్ వంటి భారీ ప్రాజెక్టులు కట్టినప్పుడు ఎలాంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం లేదు. కానీ ఇప్పుడు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. అయినా ఏళ్ళ తరబడి నిర్మాణం అంటే ఎలా? అని ఎవరూ ప్రశ్నించడం లేదు. అందువల్లే సాగునీటి ప్రాజెక్టులు పాలకులకు ఏటీఎంలుగా మారిపోయాయి.
అయితే ఫ్లోరైడ్ పీడిత నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాలకు త్రాగు, సాగు నీరు అందించేందుకు సమైక్య రాష్ట్రంలో అంటే 1996లో చేపట్టిన పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు కూడా అలాగే ఇంతకాలం నత్తనడకలు నడిచింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి నిర్మాణ పనులు వేగవంతం చేసింది.
దీనిలో భాగంగా మార్కాపురం జిల్లాలోని రూ. 465 కోట్లు వ్యయంతో గంటవానిపాలెం వద్ద ఫీడర్ కెనాల్ (కాలువ) లైనింగ్ పనులకు సిఎం చంద్రబాబు నాయుడు నేడు శంకుస్థాపన చేశారు.
శ్రీశైలం రిజర్వాయర్ నుంచి 43.5 టీఎంసిల నీళ్ళు నల్లమల సాగర్ జలాశయానికి తరలించేందుకు ఇప్పటికే 18.8 కిమీ పొడవైన రెండు సొరంగ మార్గాల తవ్వకాలు, వాటి లైనింగ్ పనులు చకచకా సాగుతున్నాయి. ఈ సొరంగ మార్గాలు, కాలువ లైనింగ్ పనులు ఈ ఏడాది జూన్ 15 నాటికి పూర్తి చేయాలని సిఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే ఈ మూడు జిల్లాలలో 15.25 లక్షల మందికి త్రాగునీరు, సుమారు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.






