సంక్రాంతి సినిమాలకు థియేటర్ల విషయంలో తన స్టాండ్ మార్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పిన నిర్మాత దిల్ రాజు దానికి తగ్గట్టే వారసుడి గ్రాండ్ ఎంట్రీ రంగం సిద్ధం చేస్తున్నారు. ఇది వ్యాపారం ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు చేసుకోండి మధ్యలో నన్ను ఆడిపోసుకోవడం దేనికని ఇటీవలే పలు సందర్భాల్లో ఆయన కుండబద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. ఇకపై సమస్యల కోసం మధ్యవర్తిత్వం వహించనని కూడా చెప్పేశారు కానీ రాబోయే రోజుల్లో జరిగే పరిణామాలను బట్టి దీనికెంతవరకు కట్టుబడతారో చూడాలి
సరే ఆయన వెర్షన్ రైటా రాంగా అనేది పక్కనపెడితే స్క్రీన్లను పంచుకునే వ్యవహారం దాదాపుగా కొలిక్కి వచ్చేస్తోంది. వారసుడుకి ఎంత ఫేవర్ జరుగుతోందో ఒక చిన్న ఉదాహరణ చూస్తే అర్థమైపోతుంది. వైజాగ్ లో చాలా కీలకమైన సింగల్ స్క్రీన్లలో మెలోడీ, సంగంలు టాప్ 5లో ఉంటాయి. వీటిని వారసుడికి ఇచ్చేశారు. ఈ రెండు థియేటర్లో ఎన్నో స్ట్రెయిట్ బ్లాక్ బస్టర్లు ఆడిన చరిత్ర ఉంది. ఇవి కాకుండా రమాదేవి, కామేశ్వరి, శ్రీకన్యలతో పాటు మూడు ఐనాక్స్ లు కేటాయించారు. ఎన్ని షోలు పడతాయో లెక్క కడితే షాక్ తినాల్సిందే
విశాఖపట్నం టాప్ 1గా చెప్పుకునే జగదాంబ వాల్తేరు వీరయ్యకు వెళ్లిపోగా వీరసింహారెడ్డికి చెప్పుకోదగ్గ సింగల్ స్క్రీన్ ఒకటే వచ్చింది. మిగిలినవన్నీ చెరి సగం పంచుకుంటారు. ఇక్కడ ఏ సినిమాకు ఎన్ని వచ్చాయనే కౌంట్ కన్నా ప్రేక్షకులు చాలా ముఖ్యంగా భావించే మంచి థియేటర్లు ఎవరికి వెళ్తున్నాయనే దాని మీద అభిమానులు సీరియస్ గా చర్చించుకుంటున్నారు. ఒకవేళ వీరయ్య వీరసింహాలకు ఎంత పాజిటివ్ టాక్ వచ్చినా వాటికి టికెట్లు దొరక్క మిగిలే ఓవర్ ఫ్లోస్ అన్నీ వారసుడుకే వెళ్తాయనే ధీమా దిల్ రాజుకు ఉండొచ్చు
పైగా తెగింపు డిస్ట్రిబ్యూటర్ కూడా కొన్ని ఏరియాలకు ఆయనే. దానికి సర్దాల్సి ఉంటుంది. ఇంకా కళ్యాణం కమనీయం, విద్య వాసుల అహం ఉన్నాయి. మొదటిదానికి యువి నిర్మాణ సంస్థ కాబట్టి వాటి ఆధీనంలో ఉన్న థియేటర్లలో ఖచ్చితంగా వేస్తారు. ఇలా నాలుగు వైపులా చిరంజీవి బాలకృష్ణ సినిమాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం స్పష్టంగా ఉంది. ఒక్క వైజాగే కాదు హైదరాబాద్ మొదలుకుని గుంటూరు దాకా ఇంచుమించు ఇదే తరహా పరిస్థితి కనిపించినా ఆశ్చర్యం లేదని ఎగ్జిబిటర్లు ఓపెన్ గానే మాట్లాడుకుంటున్నారు. మరి స్వంతంగా పంపిణి ఆఫీస్ పెట్టుకున్న మైత్రి అధినేత తన రెండు ప్రతిష్టాత్మక సినిమాల కోసం అసలు గేమ్ ప్లాన్ ఏదైనా ఉందో లేదో



